రెహ్మాన్ తో స్వరం కలపనున్న రజిని

- December 20, 2017 , by Maagulf
రెహ్మాన్ తో స్వరం కలపనున్న రజిని

చెన్నై: ఇళయరాజా తర్వాత సినీ సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన 'సంగీత తుపాను' ఏఆర్‌ రెహ్మాన్‌. ఏకంగా రెండు ఆస్కార్‌ అవార్డులను ఒకేసారి సొంతం చేసుకుని దేశానికే ఖ్యాతి తెచ్చి పెట్టారు. ఇటీవలే ఆయన 25 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 23వ తేదీన ఎన్‌కోర్‌ పేరిట దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రెహ్మాన్‌ సంగీత విభావరి జరగనుంది. 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా రెహ్మాన్‌ను సన్మానించే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా పాల్గొని రెహ్మాన్‌ను సన్మానించనున్నారు. అంతేకాకుండా ఈ సంగీత విభావరిలో రజనీకాంత్‌ ఓ పాటను పాడనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా విడుదలకు సిద్ధమవుతున్న '2.ఓ' చిత్రానికి రెహ్మాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. బహుశా ఆ సినిమాలోని పాటను పాడొచ్చని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా 1992లో 'మన్నన్‌' చిత్రంలో ఓ పాట పాడారు రజనీకాంత్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com