పెరూలో డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి ఘోరరోడ్డు ప్రమాదం 44 మంది దుర్మరణం

- February 22, 2018 , by Maagulf
పెరూలో డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి ఘోరరోడ్డు ప్రమాదం 44 మంది దుర్మరణం

లిమా(పెరూ): పెరూలోని ఒకొనా రీజియన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 44 మంది దుర్మరణం చెందారు. బుధవారం అరెకిపాలోని పాన్ అమెరికన్ హైవేపై ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఓ నదిపై నిటారుగా ఎత్తైన కొండలను ఆనుకుని వెళ్లే హైవే మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎమెర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. బాధితుల మృతదేహాలు కిందనే ఉన్న నదిలో కొంత దూరం మేర కొట్టుకుపోయాయనీ.. ఇప్పటి వరకు 44 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బస్సు బయల్దేరినప్పుడు అందులో మొత్తం 45 మంది ప్రయాణిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే మార్గమధ్యంలో మరికొందరు ఎక్కినట్టు భావిస్తున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా ప్రమాదం గురించి తెలుసుకున్న పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుజిన్‌స్కి... భాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ''అరెకిపాలో జరిగిన ఘోర ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు నా ప్రగాఢ సానుభూతి. తక్షణ సాయం అందించే విధంగా అన్నిరకాల చర్యలు తీసుకున్నాం. బాధితులకు సత్వర చికిత్స అందించే విధంగా వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించాం...'' అని ట్వీట్ చేశారు. కాగా గత నెలలో ఇదే రహదారిపై పసామాయో సమీపంలో ఓ బస్సు మరో ట్రక్కును ఢీకొట్టటంతో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com