పాక్‌: హఫీజ్‌ సయీద్‌పై శాశ్వత నిషేధం విధించే ఆలోచన

- April 08, 2018 , by Maagulf
పాక్‌: హఫీజ్‌ సయీద్‌పై శాశ్వత నిషేధం విధించే ఆలోచన

దిల్లీ: ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జేయూడీ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌పై పాకిస్థాన్‌ శాశ్వత నిషేధం విధించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఆ దేశ ప్రధాన సంచిక డాన్‌ తన కథనంలో పేర్కొంది. 1997 నాటి యాంటీ టెర్రరిజం యాక్ట్‌(ఏటీఏ)లో సవరణలు చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును తీసుకురానుంది. ఈ బిల్లును పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో చర్చకు తీసుకురానున్నట్లు డాన్‌ వెల్లడించింది. ఈ బిల్లుకు అసెంబ్లీ, పాక్‌ సెనేట్‌ అంగీకారం తెలిపితే హఫీజ్‌పై శాశ్వత నిషేధం విధించేందుకు అవకాశం ఉంటుంది.

మనీలాండరింగ్‌, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించేందుకు ఈ బిల్లు రూపకల్పన చేసినట్లు సమాచారం. ఇప్పటికే హఫీజ్‌కు అండగా నిలుస్తోందని పాకిస్థాన్‌పై అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇటీవల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విడుదల చేసిన ఉగ్రవాద జాబితాలో హఫీజ్ సయీద్‌ పేరు కూడా ఉంది. ఇప్పటికే చాలాసార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాక్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ స్వర్గధామంగా నిలుస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే హఫీజ్‌ రాజకీయ పార్టీ పెట్టి ఈ ఏడాది అక్కడ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాడు. అయితే.. హఫీజ్‌ ప్రారంభించిన రాజకీయ ఫ్రంట్‌ను అమెరికా ప్రకటిత విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com