శ్రీదేవి ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నాను

- April 13, 2018 , by Maagulf
శ్రీదేవి ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నాను

ముంబయి: దివంగత నటి శ్రీదేవి చనిపోయే కొద్ది గంటల ముందు ఆమెతో ఫోన్లో మాట్లాడానని తన ప్రాణ స్నేహితురాలిని గుర్తుచేసుకున్నారు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా. శ్రీదేవి, మనీశ్‌ మంచి స్నేహితులు. పార్టీలకు, సినిమా కార్యక్రమాలకు వెళ్లాలంటే శ్రీదేవి మనీశ్‌ డిజైన్‌ చేసిన దుస్తులనే ధరించేవారు. అంత దగ్గరి స్నేహితురాలు హఠాన్మరణం చెందడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ అందాల తారను గుర్తుచేసుకుంటూ తాజాగా మనీశ్‌ సోషల్‌మీడియాలో ఓ భావోద్వేగపు పోస్ట్‌ పెట్టారు. 'నాతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఓ స్నేహితురాలిని కోల్పోవడం ఇదే మొదటిసారి. ఆమె చనిపోయి నెల రోజులకుపైగా కావొస్తున్నా ఇప్పటికీ అబద్ధంగానే ఉంది. శ్రీదేవి నాకు 28 ఏళ్లుగా తెలుసు. ఇద్దరం కలిసి పెళ్లిలో సందడి చేశాం. అంతలోనే ఆమె అంత్యక్రియల కోసం తన సోదరి శ్రీలత నాకు సిల్క్‌ చీర ఇచ్చారు. శ్రీదేవి చనిపోయే కొన్ని గంటల ముందే ఆమెతో ఫోన్లో మాట్లాడాను. జాన్వి తొలి సినిమా గురించే చాలా సేపు మాట్లాడుకున్నాం. ఇప్పటికీ నాకు శ్రీదేవి ఫోన్‌ చేసి ఈవెంట్‌కి ఏ దుస్తులు వేసుకోవాలి? అని అడుగుతారేమోనని ఎదురుచూస్తున్నాను'. 

'శ్రీదేవి ఎవరి గురించీ తప్పుగా మాట్లాడేవారు కాదు. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె మరొకరి గురించి ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఎప్పుడూ దుస్తులు, ఆహారం, సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా నిబద్ధతతో నటించేవారు. శ్రీదేవి కుమార్తెలు జాన్వి, ఖుషిలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి కోసం గాగ్రా ఛోళీలు డిజైన్‌ చేసేవాడిని. ఇప్పుడు జాన్వి తొలి సినిమా కోసం దుస్తులు డిజైన్‌ చేస్తున్నా. అమ్మలాగే జాన్విలో ఎంతో ప్రతిభ ఉంది.' అని పేర్కొన్నారు మనీశ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com