10 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది

- April 14, 2018 , by Maagulf
10 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది

స్వస్త్‌.. సమర్థ్‌.. సంతోష భారతాన్ని నిర్మించటమే తన లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పినట్టుగానే ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించారు. ఛ‌త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో తొలి ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించిన మోడీ.. వెల్‌నెస్‌ సెంటర్లు ఫ్యామిలీ డాక్టర్లలా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రాణాంతక జబ్బులతో బాధపడే వారికి ఆర్ధికసాయం అందిస్తామని ప్రకటించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈసారి బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఆవిష్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఏర్పాటు చేసిన తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోడీతోపాటు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా 2022 నాటికి 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌తో పాటు వృద్ధాప్యం వల్ల వచ్చే పలు సమస్యలకు చికిత్స అందించేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకంతో దేశంలోని 40 శాతం జనాభాకు బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల బీమా సదుపాయం లభిస్తుంది. దాదాపు 10 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో బస్తర్‌ ఇంటర్నెట్‌ పథకం కింద 40వేల కిలోమీటర్ల పొడవైన ఫైబర్‌ ఆప్టిక్స్‌ నెట్‌వర్క్‌ మొదటి దశను మోదీ ప్రారంభించారు. ఈ నెట్‌వర్క్‌ను రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. బీజాపూర్‌లో కొత్త రైలు మార్గాన్ని కూడా ప్రారంభించారు. మోడీ ఏడు గ్రామాల్లో బ్యాంకు శాఖలను కూడా ప్రారంభించారు. అలాగే 1700కోట్ల విలువైన రోడ్డు, వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com