రాష్ట్రపతి ఆమోద ముద్ర

- April 22, 2018 , by Maagulf
రాష్ట్రపతి ఆమోద ముద్ర

న్యూదిల్లీ: పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారిక మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈమేరకు ఈ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం సంతకం చేశారు. దీని ప్రకారం పన్నెండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష పడనుంది.

ఆర్డినెన్సులో ఏమున్నాయంటే...

*మహిళలపై జరిగే అత్యాచారాలకు ఇప్పటి వరకూ ఉన్న ఏడేళ్ల శిక్షను పదేళ్లకు పెంచారు. నేర తీవ్రతను బట్టి ఇది జీవితఖైదుగా మారవచ్చు.

*16ఏళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న 10సంవత్సరాల జైలు శిక్షను 20ఏళ్లకు పెంచారు.

*12ఏళ్లలోపు చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడే వారికి కనీస శిక్షగా జీవిత ఖైదు లేదా మరణశిక్షగానీ విధిస్తారు. దీనికి సంబంధించిన అప్పీళ్లపై ఆయా ఉన్నత న్యాయస్థానాలు ఆరు నెలల్లో వారి నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుంది.

*16ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం, మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడిన వారికి ఎటువంటి ముందస్తు బెయిళ్లూ ఇవ్వకూడదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు, బాధితుల తరఫు బంధువులకు కనీసం రెండు వారాల ముందస్తు నోటీసులు ఇవ్వాలి.

కథువా, ఉన్నావ్‌, సూరత్‌లో మైనర్లపై జరిగిన అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలంటూ అలోక్‌ శ్రీవాస్తవ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించగా.. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ, కేంద్రానికి ప్రతిపాదించారు. దీనికి దేశవ్యాప్తంగా మద్దతు లభించడంతో శనివారం కేంద్రం పోక్సో చట్టానికి ఆమోదం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com