నేనలా అనలేదు.. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు!

- May 13, 2018 , by Maagulf
నేనలా అనలేదు.. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు!

లాహోర్: 2008 ముంబై దాడులు పాకిస్థాన్ ఉగ్రవాదుల పనే అని అంగీకరించిన ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంతలోనే మాట మార్చారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని ఆయన తరఫు ప్రతినిధి మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ మధ్య పాక్‌లోని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబై దాడులు పాక్ ఉగ్రవాదుల పనే అని షరీఫ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ దేశంలో మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయని, వాళ్లను సరిహద్దు దాటించి ముంబైలో దాడులు చేయించారని చెప్పారు. ముంబై దాడుల విచారణను ఎందుకు పూర్తి చేయడం లేదంటూ ప్రశ్నించారు. అయితే షరీఫ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. షరీఫ్ కామెంట్స్‌ను ఇండియన్ మీడియా తప్పుగా అర్థం చేసుకుంది. దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌లోని ఓ వర్గం ఉద్దేశపూర్వకంగానో లేక మరో విధంగానో ఇండియన్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థించింది. కనీసం వాటిలో నిజానిజాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అని షరీఫ్ తరఫు ప్రతినిధి తెలిపారు. పనామా పత్రాల కేసులో ఇరుక్కున్న షరీఫ్‌ను జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా పాక్ సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com