అమరావతి:మేమంతా అధికార పార్టీ తరుపున ఉంటాం

- August 28, 2018 , by Maagulf
అమరావతి:మేమంతా అధికార పార్టీ తరుపున ఉంటాం

గుంటూరులోని కేబీఆర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన నారా హమారా- టీడీపీ హమారా సభ జన సంద్రమైంది. భారీగా మైనార్టీలు సభకు హాజరై తామంతా అధికార పార్టీ తరుపున ఉంటామనే భరోసా కల్పించారు. సభకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మొదట ముస్లిం మైనారిటీలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు.

సభ ప్రారంభానికి ముందు.. ఎన్టీఆర్‌, లాల్‌జాన్‌ బాషా చిత్ర పటాలకు నేతలు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.మోడీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అవినీతి వైసీపీ, కుట్రలు పన్నే పవన్‌ కల్యాణ్‌ను ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు చంద్రబాబు..

ఏపీలో జగన్‌, మోడీ నాటకాలు సాగవని. కుట్ర పన్నింది బీజేపీ అయితే పాత్రధారి వైసీపీ అని చంద్రబాబు ఆరోపించారు. దగాపడ్డ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా.. భజన చట్టంలోని హామీల కోసం పోరాడుతున్నా అన్నారు. పార్లమెంట్‌ వేదికగా టీడీపీ ఎంపీలు ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఇదే జిల్లాకు చెందిన గల్లా జయ్‌దేవ్‌ పార్లమెంట్‌లో హీరోగా నిలిచారన్నారు..

భజన హామీలు ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరాని నిధులు ఇవ్వడం లేదు. విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయడం లేదు. విద్యా సంస్థలకు నిధులు ఇవ్వడం లేదు. ఏది అడిగినా అరకొర నిధులతో సరిపెడుతున్నారని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.. ఇప్పుడు కొత్తగా పీడీ అకౌంట్స్‌పై ఆపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు..

ముస్లిం మైనార్టీల జోలికి వచ్చి. ఎవరైనా తోక జాడితే.. తడఖా చూపిస్తాం ఖబడ్దార్‌ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా ముస్లింలపై దాడులకు బీజేపీ పాల్పడుతోందని.. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలంతా టీడీపీకి ఓటేసి.. బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు..

కేంద్రంపై మరోసారి నిప్పులు చెరిగారు మంత్రి లోకేష్‌.. మొన్న కర్నాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు కేవలం ట్రైలర్‌ మాత్రమే చూపించారని.. వచ్చే 2019 ఎన్నికల్లో తెలుగు జాతి సినిమా చూపిస్తుంది అంటూ హెచ్చరించారు. ఏపీలోని విపక్ష నేతలు జగన్‌, పవన్‌ల తీరుపైనా లోకేష్‌ మండిపడ్డారు. బీజేపీ అంటే భారత జగన్‌, పవన్‌ల పార్టీ అంటూ కొత్త అర్థం చెప్పారు లోకేష్‌..

సభా ఏర్పాట్లను పర్యవేక్షించిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషా.. మైనార్టీలకు అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ తెలుగు దేశమే అని చెప్పారు.. మైనార్టీలంతా బీజేపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని.. అంతా కచ్చితంగా టీడీపీకే ఓటేస్తారని ఆయన భరోసా ఇచ్చారు..

చివర్లో సభకు హాజరైన వారందరితో నారా హమారా అని నినాదాలు చేయించారు చంద్రబాబు.. ఈ సభలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, నారా లోకేశ్‌, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, జవహర్‌, పితాని సత్యనారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఆనందబాబు, నారాయణ, శిద్దా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com