రూల్స్ సడలించిన ఖతార్

- September 05, 2018 , by Maagulf
రూల్స్ సడలించిన ఖతార్

ఖతార్: విదేశీ వర్కర్లకు ఖతార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివాదాస్పద ఎగ్జిట్‌ వీసా విధానాన్ని సవరిస్తున్నట్టు ఖతార్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న లక్షల మంది వలస కార్మికులకు భారీ ఊరట కలిగింది. ఈ వీసా విధానం సవరణతో, యజమానులు(ఎంప్లాయర్స్‌) అనుమతి లేకుండానే.. కార్మికులు ఆ దేశం విడిచి రావొచ్చు. సుదీర్ఘకాలంగా కార్మిక హక్కుల సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్‌ను ఖతార్‌ ప్రభుత్వం ఆమోదించింది. ఖతార్‌లో పనిచేస్తున్న చాలా మంది వలస కార్మికులను ఆ దేశం విడిచి వెళ్లకుండా ఎంప్లాయర్స్‌ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కాంట్రాక్ట్‌ సమయం అయిపోయినప్పటికీ, యజమానులు తమల్ని విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతార్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ కార్మికులకు భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఖతార్‌లో 16 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వెళ్లినవారే. వారిలో ఎక్కువగా కూడా భారత్‌ నుంచి ఖతార్‌ వెళ్లినవారే ఉన్నారు. 

ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. దీని వల్ల వలస కార్మికుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులకు కనీస వేతనం, బకాయి వేతనాల చెల్లింపు, ఫండ్లు అందనున్నాయి. ఖతార్లోని వలస కార్మికులకు మంచి పనిని, రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూమిమి తెలిపారు. 2022లో ఖతార్‌ ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ పనుల్లో భారీ ఎత్తున్న విదేశీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖతార్‌లో పనిచేస్తున్నారు. అయితే ఎగ్జిట్‌ వీసా విధానంలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ, విదేశీ కార్మికులు, ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ప్రస్తుత యజమానుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com