ఇండియన్ ఆర్మీలో లక్షన్నర ఉద్యోగాలకు కోత!

- September 10, 2018 , by Maagulf
ఇండియన్ ఆర్మీలో లక్షన్నర ఉద్యోగాలకు కోత!

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీని మరింత ప్రభావవంతంగా, భవిష్యత్తు యుద్ధాలకు సన్నద్ధం చేసేలా కొన్ని కీలక చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కేడర్ రీవ్యూ నిర్వహించారు. కమిటీ సిఫారసు మేరకు వచ్చే నాలుగైదేళ్లలో లక్షన్నర ఉద్యోగాల్లో కోత విధించాలని ఇండియన్ ఆర్మీ భావిస్తున్నది. 12 లక్షల మందిగా ఉన్న ఆర్మీ బలగాల సంఖ్యను తగ్గించడంతోపాటు ఆర్మీలోని వివిధ విభాగాలను విలీనం చేసి వాటి పనితీరును మెరుగుపరచాలని క్యాడర్ రీవ్యూ సిఫారసు చేసింది. మిలిటరీ సెక్రటరీ లెఫ్ట్‌నెంట్ జనరల్ సంధు నేతృత్వంలోని 11 మంది సభ్యుల ప్యానెల్ ఈ సమీక్షను నిర్వహిస్తున్నది. ఈ నెల చివరిలోగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు తమ ప్రాథమిక నివేదికను సమర్పించనుంది.
నవంబర్‌లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. వివిధ విభాగాలను విలీనం చేయడం, హేతుబద్ధీకరించడం వల్ల వచ్చే రెండేళ్లలో 50 వేల ఉద్యోగాల వరకు కోత పడుతుంది. 2022-23లోగా మరో లక్ష మంది బలగాలను తగ్గించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇదంతా ఇంకా అధ్యయన దశలోనే ఉంది అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని డైరెక్టరేట్స్, లాజిస్టిక్ యూనిట్లు, సమాచార వ్యవస్థలు, ఇతర పరిపాలన శాఖల్లోని విభాగాలను విలీనం చేయడం ద్వారా సిబ్బంది తగ్గింపు చర్యను చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com