సత్తా చాటుతోన్న ఇస్రో.. వచ్చే ఆరు నెలల్లో 18 ప్రయోగాలు..

- September 16, 2018 , by Maagulf
సత్తా చాటుతోన్న ఇస్రో.. వచ్చే ఆరు నెలల్లో 18 ప్రయోగాలు..

వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం సక్సెస్‌ అయింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ42 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్వీ విజయంతో జోష్‌ మీదున్న సైంటిస్టులు… వచ్చే ఆరు నెలల్లో 18 ప్రయోగాలకు రెడీ అవుతున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో… మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ42 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక ద్వారా విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. ఈ మిషన్‌ సక్సెస్‌ కావడంతో సైంటిస్టులు సంబరాలు చేసుకున్నారు.

మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం నిర్వహించగా… రెండు విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నిర్ణీత కక్ష్యలోకి బ్రిటన్‌కు చెందిన నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలు ప్రవేశించాయి. ఈ రెండు ఉపగ్రహాలు భూమిని పరిశీలించనున్నాయి. సర్వే శాటిలైట్ టెక్నాలజీ నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలకు రూపకల్పన చేసింది. వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఇస్రో ఉపగ్రహాలను ప్రయోగించారు. 33 గంటల కౌంట్‌డౌన్‌ తర్వాత రాకెట్‌ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు.

889 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను సూర్యుడి స్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అడవుల పరిధిని లెక్కగట్టడంతో పాటు వరదలు, విపత్తుల పర్యవేక్షణకు అవసరమైన సమాచారాన్ని ఈ శాటిలైట్‌లు అందించనున్నాయి. బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీస్ సంస్థకు, ఇస్రో వాణిజ్యవిభాగమైన ఆంట్రిక్స్ కార్పొరేషన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ 42 ప్రయోగం సక్సెస్‌ కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్‌ శివన్‌ అభినందించారు. పీఎస్‌ఎల్వీ వినియోగదారులకు అనుకూల వాహన నౌకగా పేరొందిందని అన్నారు. వచ్చే ఆరు నెలల్లో 18 ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. పది జీఎస్‌ఎల్వీ, 8 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలు చేపడతామన్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటుతూ యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు చేస్తోంది ఇస్రో. మన దేశానికే కాకుండా పక్క దేశాల అవసరాలకు సైతం ఇక్కడ్నుంచే ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. వాణిజ్యపరంగా దేశానికి ఆదాయాన్ని తీసుకొస్తోంది. గెలుపు గుర్రంగా మారిన PSLV రాకెట్ల ద్వారా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపుతోంది. ఇప్పటి వరకు ఇస్రో 44 PSLV రాకెట్లను కక్ష్యలోకి పంపించింది. వీటిలో రెండు మాత్రమే ఫెయిల్ అయ్యాయి. 1993, సెప్టెంబర్ 20వ తేదీన PSLV రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అయితే.. 1994, అక్టోబర్ నెల నుంచి PSLV విజయపరంపర ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుస ప్రయోగాలతో ఇస్రో తన సత్తా చాటుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com