రెండు రోజులు మహిళలకు ప్రవేశం

- November 24, 2018 , by Maagulf
రెండు రోజులు మహిళలకు ప్రవేశం

కొచి: శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రవేశం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం రెండు రోజుల పాటు మహిళా భక్తులకు ఆలయంలో ప్రవేశించి పూజలు చేసుకునేందుకు వీలు కల్పిస్తామని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నలుగురు మహిళలు కొచిలో తమకు ఆలయ ప్రవేశం కల్పించేందుకు వీలుగా భద్రత కల్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన మహిళల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల లోపు ఉంటుంది. ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించేందుకు వీలుగా రెండు మూడు రోజుల సమయం కేటాయించాలని కోరారు. దీని వల్ల పోలీసులు భద్రత కల్పించేందుకు వీలవుతుందన్నారు. పైగా వీరిపై ఆందోళన కారులు దాడులు చేయకుండా నిరోధించవచ్చన్నారు. ఈ పిటిషన్‌ను రేష్మా నిషాంత్, షానిలా సాజీష్, ధాన్య వీఎస్, సూర్య ఎం అనే మహిళలు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం వద్ద దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రుషీకేష్ రాయ్, జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్ దాఖలు చేశారు.

కోర్టులో వాదనల సందర్భంగా పిటిషనర్లు పేర్కొన్నట్లుగా రెండురోజుల పాటు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించి ఆలయ ప్రవేశం, పూజలు నిర్వహించేందుకు అవకాశం కల్పించేందుకు బాగుంటుందని కేరళ ప్రభుత్వం కోర్టులో ప్రతిపాదించింది. తాము స్వామి అయ్యప్పకు భక్తులమని, నిర్దేశించిన నియమాలను పాటిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. తాము కూడా నల్లదుస్తులు వేసుకుంటామన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించాలన్న శ్రద్ధ, అంకితభావం, భక్తితో తాము ఉన్నామని పిటిషనర్లు పేర్కొన్నారు.

కాని ఆలయం వెలుపల బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తూ అటకాయిస్తున్నారన్నారు. కాగా కోర్టు అనుమతి లేకుండా ట్రావెన్‌కోర్ ఆలయ బోర్డు నిధులను ప్రభుత్వానికి మళ్లించరాదని హైకోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com