జెనీవా:లింగ సమానత్వ సాధనకు మరో రెండు శతాబ్దాలు
- December 19, 2018జెనీవా: పని ప్రదేశాలలో లింగసమానత్వం కోసం మహిళలు అనేక ఏళ్లుగా గొంతెత్తుతున్న నేపథ్యంలో ఈ లక్ష్య సాధనకు మరో రెండు శతాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) వెలువరించిన తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వేతన సమానత్వంలో కొంత మెరుగుదల కన్పిస్తోందని, అయితే ప్రపంచ వ్యాప్తంగా దశాబ్ద కాలంలో లింగ వివక్ష విస్తరించిందని డబ్లుఇఎఫ్ తన నివేదికలో వెల్లడించింది. రాజకీయ రంగంలో మహిళలకు ప్రాతినిధ్యం తగ్గుతున్న నేపథ్యంలోనే విద్య, ఆరోగ్య రంగాలలో అసమానతలు విస్తరిస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.
ప్రస్తుత పరిణామాల ప్రకారం విశ్వవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న లింగ వివక్షకు మరో 108 ఏళ్లకు గానీ తెరపడదని, పని ప్రదేశాలలో ఈ వివక్షకు తెరదించేందుకు మరో 202 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని డబ్లుఇఎఫ్ స్పష్టం చేసింది. ప్రపంచంలోని 149 దేశాలలో విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ సాధికారికత వంటి అంశాలలో కొనసాగుతున్న లింగ వివక్షపై అధ్యయనం చేసిన డబ్ల్యుఇఎఫ్ ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా విద్య, ఆరోగ్యం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి వాటిలో మహిళలు గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ ఈ ఏడాది వారికి ఈ రంగాలలో ఎదురు దెబ్బలు తగిలాయని డబ్ల్యుఇఎఫ్ వివరించింది.
ఆర్థిక అవకాశాల విషయంలో మాత్రం ఈ వివక్ష కొంతమేరకు తగ్గిందని, అయితే అది సంబరాలు జరుపుకోవాల్సిన స్థాయిలో లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేతనాలలో లింగ వివక్ష 51 శాతం మేర కొనసాగుతోందని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా నాయకత్వ స్థానంలో మహిళల పాత్ర కేవలం 34 శాతానికి మాత్రమే పరిమితమైందని తెలిపింది. అయితే ఆటోమేషన్ ప్రక్రియ పురుషుల ఉద్యోగాలపై చూపుతున్నంత స్థాయిలో సంప్రదాయకంగా మహిళలు చేసే ఉద్యోగాలపై చూపటం లేదని ఈ నివేదిక వెల్లడించింది. శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, గణిత నైపుణ్యాలు అవసరమైన రంగాల ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా తక్కువ స్థాయిలోనే వుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక