తెలంగాణలో చలి పంజా..

- December 20, 2018 , by Maagulf
తెలంగాణలో చలి పంజా..

చలి కాలంలో చలి ఉండడం వింతేమీ కాదు. అయితే పెథాయ్ తుఫాన్ తో పాటు ఉత్తరాది నుంచి శీతలగాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి తేమగాలులు వస్తున్నాయి.ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతుండంతో జనం ఇంటి నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు చలితో అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి, చలి పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో జనం అవస్థలు పడ్తున్నారు. చలి పంజాకు బుధవారం ఒక్కరోజే తెలంగాణలో సుమారు 26 మంది మృతి చెందారు. అయితే మరో రెండు రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

తెలంగాణతో పోలిస్తే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో చలి కాస్త తక్కువగా ఉంది. తెలంగాణలో చలికి తట్టుకోలేక నిన్న ఒక్కరోజే సుమారు 26 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరుగురు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నలుగురు. నల్గొండ జిల్లా లో ఇద్దరు, వికారాబాద్ జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్‌ లో ఇద్దరు, భద్రాద్రి జిల్లాలో మరో ఇద్దరు చనిపోయారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఒకరు చలికి బలయ్యారు.

హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ లో చలి పంజా ఇద్దరి ప్రాణం తీసింది. చలి తీవ్రత పెరగటంతో ఇంట్లో వేడి కోసం బొగ్గుల కుంపటి పెట్టగా, పొగకు ఊపిరి ఆడక తల్లికొడుకు మృతి చెందారు. వీరిని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందినవారిగా గుర్తించారు.

చలి తీవ్రతకు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇద్దరు వృద్ధులు బలయ్యారు. చలికి తాళలేక నాగినేని ప్రోలురెడ్డి పాలెం గ్రామానికి చెందిన కొండపర్తి వెంకటప్పయ్యతో పాటు బూర్గంపాడు గ్రామానికి చెందిన పుట్టి పిచ్చయ్య మృతి చెందారు.

మరో రెండు రోజుల్లో పరిస్థితి మెరుగవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ పైనా తుఫాను ప్రభావం పోయిందని చెబుతున్నారు. బుధవారం హైదరాబాద్ లో సూర్యుడు కనపించాడని, పగటి ఉష్ణోగ్రత 4 డిగ్రీలు పెరిగిందన్నారు. గురువారం, శుక్రవారం ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com