అమెరికా కంపెనీలకు భారత ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది

- December 22, 2018 , by Maagulf
అమెరికా కంపెనీలకు భారత ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది

స్థానికంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకొన్న అమెరికా కంపెనీలకు భారత ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీలు ఆర్జించిన ఆదాయం, లాభం, అమ్మకాలు వంటి వివరాలన్నిటినీ డిసెంబర్ 31 లోగా ఆదాయపన్ను శాఖ అధికారులకు అందజేయాలని ఆదేశించింది. ఆదేశాలు అందుకొన్న కంపెనీలలో గూగుల్, ఫేస్ బుక్, డెల్, యాక్సెంచూర్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సమాచార వినిమయంపై అమెరికా, భారత్ ల మధ్య చర్చలు ఇంకా జరుగుతుండగానే భారత్ 10 రోజుల్లో ఆర్థిక వివరాలు అందించాలని తాఖీదులు పంపడంతో సంస్థలు విస్మయానికి గురయ్యాయి.

పన్ను ఎగవేతను నిరోధించే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన బీఈపీఎస్ (బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షేరింగ్) మార్గదర్శకాల మేరకు ఆర్థిక సమాచారాన్ని ఆదాయపన్ను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. పన్నుల చెల్లింపులో పారదర్శకత పెంచేందుకు రూపొందించిన బీఈపీఎస్ కార్యాచరణ ప్రణాళికను ఓఈసీడీ, జీ20 దేశాలు 2013లో గుర్తించాయి. ఇందులో పన్ను అధికారులకు కీలక సమాచారం మొత్తం తప్పనిసరిగా అందజేయాలి. భారత్ లోని బహుళజాతి కంపెనీలు కూడా ఇప్పుడు తమ ఆర్థిక వివరాలను అధికారులకు సమర్పించాల్సి వస్తుంది. అయితే ఓఈసీడీలో భాగస్వాములు కానీ దేశాల్లోని కంపెనీలకు మినహాయింపు ఉంది. ప్రతి ఏడాది అందజేసే ఈ నివేదికను కంట్రీ-బై-కంట్రీ (సీబీసీ) రిపోర్ట్ అంటారు.

బీఈపీఎస్ కింద బహుళజాతి కంపెనీలు తాము ఆర్జించిన ఆదాయం, చెల్లించిన పన్నులు, ఉద్యోగుల సంఖ్య, వారు కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతి దేశంలో సరఫరా వ్యవస్థల గురించి ప్రకటించాల్సి ఉంటుంది. బహుళజాతి కంపెనీల్లో యూరప్, జపాన్, కొరియా, చైనా సంస్థలు ఇప్పటికే భారత పన్ను అధికారులకు ఈ వివరాలు అందించాయి. ఇప్పటి వరకు ఓఈసీడీలో అమెరికా భాగం కాలేదు. అందువల్ల ఇన్నాళ్లూ అమెరికా కంపెనీలేవీ తమ ఆర్థిక వివరాలను అందజేయడం లేదు. తాజాగా సీబీడీటీ సర్కులర్ పంపడంతో ఈ కంపెనీల్లో ఆందోళన మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com