పుల్వామా దాడిపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌..భారత్‌ దాడికి ప్రతిదాడి తప్పదు..

- February 19, 2019 , by Maagulf
పుల్వామా దాడిపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌..భారత్‌ దాడికి ప్రతిదాడి తప్పదు..

ఇస్లామాబాద్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పుల్వామా ఘటనపై తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆధారాలు లేకుండా భారత్‌ తమను నిందిస్తోందని ఇమ్రాన్‌ ఆరోపించారు.

'ఉగ్రదాడితో పాక్‌కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇలాంటి దాడి చేస్తే మాకేంటి ప్రయోజనం. మేం ఉగ్రవాదాన్ని కాదు స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించకండి. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్‌ మాపై ఆరోపణలు చేస్తోంది. శాంతి కోసం చేస్తున్న పోరాటంలో మేం ఇప్పటికే లక్షల మంది ప్రజలను కోల్పోయాం. మీరన్నట్లు నిజంగానే దాడిలో పాక్‌ ప్రమేయం ఉన్నట్లు తేలితే దర్యాప్తునకు సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దానికి నేను హామీ ఇస్తున్నా' అని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పుకొచ్చారు.

'యుద్ధాన్ని ప్రారంభించడం సులువే. అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ యుద్ధం ఎక్కడ ముగుస్తున్నది ఆ దేవుడికే తెలియాలి. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి. దాడి చేస్తే పాక్‌ ప్రతిఘటించదని భారత్‌ భావిస్తోంది. కానీ మీ చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది' అని ఇమ్రాన్‌ హెచ్చరించారు. కశ్మీర్‌ ప్రజలు చావుకు భయపడట్లేదని భారత్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com