ముగ్గురు హైదరాబాద్ యువకులు సిరియా వెళ్లాలని రెండేళ్ల నుంచి ప్రయత్నం
- December 30, 2015
ప్రపంచ శాంతికి విఘాతంగా మారిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు మద్దతుగా సిరియా వెళ్లాలని రెండేళ్ల నుంచి అనుకుంటున్నామని ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు హైదరాబాద్ యువకులు పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు తెలిపారు. నిరుడు సెప్టెంబరులో ఒకసారి ప్రయత్నించామని చెప్పారు. కోల్కతా నుంచి బంగ్లాదేశ్ మీదుగా అఫ్గానిస్థాన్ వెళ్లాలనుకున్నామనీ, కానీ, హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో అది ఫలించలేదన్నారు. దీంతో కొత్త పథకం రచించామని తెలిపారు. 'నాగ్పుర్, యవత్మాల్లో 'సిమి' మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్ అనుచరులున్నారు. వారు ప్రస్తుతం ఐఎస్ఐఎస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా వారితో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. వారి సాయంతో నాగ్పుర్ నుంచి శ్రీనగర్కు వెళ్లేందుకు ప్రయత్నించాం' అని అబ్దుల్లా బాసిత్, మాజ్ హుస్సేన్, ఒమర్ ఫరూక్లు వివరించారు. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించేముందు వారు తాము ఐఎస్ఐఎస్ పట్ల ప్రేరేపితమైన తీరును తెలిపారు. నాగ్పుర్లో కొందరు యువకులు ఇచ్చిన సమాచారంతో శ్రీనగర్లో ఉంటున్న ఐఎస్ఐఎస్ బాధ్యురాలు ఆసియాన్ అంద్రాబీని కలవాలని అనుకున్నామనీ, అక్కడి నుంచి అఫ్గానిస్థాన్, సిరియా, పాలస్తీనాలకు వెళ్లాలని భావించినట్లు తెలిపారు. కాగా, తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత, సిరియా వెళ్లేందుకు అబ్దుల్లా బాసిత్, మాజ్ హుస్సేన్లు పక్కా ప్రణాళికను రచించారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఒమర్ ఫరూక్కు తమ పథకాన్ని వివరించి, అతడిని కూడా ఒప్పించారు. ముగ్గురూ కలిసి పోలీసులకు చిక్కకుండా సిరియా వెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. తమ పాత ఫోన్లను, సిమ్కార్డులను కొనసాగిస్తూనే, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వేరేఫోన్లను కొనుగోలుచేశారు. అబ్దుల్లా బాసిత్... ల్యాప్ట్యాప్ నుంచి సామాజిక మాధ్యమం ద్వారా ఆసియాన్ ఆంద్రాబీ అనుచరులతో ఛాటింగ్ చేసి, పూర్తికాగానే ఆ సంభాషణలను చెరిపేసేవాడు. ఇటీవల ఈ ముగ్గురూ హుమయూన్నగర్లో మూడుసార్లు సమావేశమయ్యారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాను తప్పించుకునేందుకు ఐదురోజుల క్రితం నల్గొండకు వెళ్లారు. అక్కడ మాజ్ హుస్సేన్ ఇంట్లో జరుగుతున్న వేడుకకు హాజరై, బయటకు వెళ్తామంటూ స్నేహితుల వద్ద బైక్లు తీసుకున్నారు. తాము శ్రీనగర్కు బయల్దేరుతున్నామంటూ అక్కడి నుంచే ఆసియాన్ అంద్రాబీ అనుచరులకు సమాచారమిచ్చారు. నల్గొండ నుంచి జాతీయ రహదారి మీదుగా ఆదిలాబాద్, అక్కడి నుంచి నాగ్పూర్ వరకూ బైక్లపై వెళ్లాలని అనుకున్నారు. డిసెంబరు 25, ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ చేరుకున్నారు. చలితీవ్రతకు తట్టుకోలేక, అక్కడి నుంచి ట్రావెల్స్ కారులో నాగ్పుర్ బయల్దేరారు. మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. మరుసటి రోజు శ్రీనగర్ వెళ్లేందుకు వీలుగా గురుకృప ట్రావెల్స్ నుంచి ఇండిగో విమానం ద్వారా ప్రయాణించేందుకు మూడు టిక్కెట్లు కొనుక్కున్నారు. తర్వాత సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ ఏకబిగిన రెండు సినిమాలు చూశారు. అర్ధరాత్రి దాటాక రైల్వేస్టేషన్ సమీపంలోని రెస్టారెంట్లో భోజనంచేసి అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున అక్కడి నుంచి విమానాశ్రయానికి వచ్చారు. ఉదయం 8.10 గంటలకు విమానం బయల్దేరుతుందన్న సమాచారంతో అక్కడే నిరీక్షించారు. బాసిత్ తల్లిదండ్రులు అప్పటికే తమ కుమారుడు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రంగంలో దిగి అన్ని విమానాశ్రయాల అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే నాగ్పుర్లో మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు వీరిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం హైదరాబాద్ పోలీసులకు వారిని అప్పగించారు. మరింత సమాచారం సేకరించేందుకు ఆ యువకులను తమకు పది రోజులపాటు కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు క్రైం బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ప్రభాకరరావు తెలిపారు
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









