మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

- April 01, 2019 , by Maagulf
మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్ఎల్వీ సీ45 రాకెట్‌ను సోమవారం నింగిలోకి పంపనున్నారు. రాకెట్ డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైంది. ఇది నిర్విరామంగా ఈరోజు ఉదయం 9.27 వరకు కొనసాగుతుంది. అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
 
ఇది మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. డీఆర్‌డీవోకు చెందిన 436 కిలోల బరువున్న ఇమిశాట్‌ను 749 కిలోమీటర్ల ఎత్తులో, విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులో నిలుపుతారు. ఆ తర్వాత రాకెట్‌ నాలుగో దశ నెమ్మదిగా 485 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని అక్కడే కక్ష్యలో తిరుగుతుంది.

నాలుగో దశలో మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని ఏర్పరచి వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు. మొదటి పేలోడ్‌లోని ఇస్రో రూపొందించిన ఆటోమెటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ సముద్ర జలాలపై ప్రయాణించే నౌకల ద్వారా వచ్చే సమాచారాన్ని సేకరించనుంది. అలాగే రెండో పేలోడ్‌లో ఆటోమేటిక్‌ ప్యాకెట్‌ రిపీటింగ్‌ సిస్టమ్‌లోని రేడియో అమెచ్యూర్‌ శాటిలైట్‌ కార్పొరేషన్‌ ప్రయోగాత్మకంగా కొన్ని పెలోడ్‌లను ఉంచి అధునాతన సాంకేతికతకు సంబంధించి పరిశోధనలు చేయనుంది. మూడో పేలోడ్‌‌లో అడ్వాన్స్‌డ్‌ రిటార్డింగ్‌ పొటెన్షియల్‌ అన్‌లైజర్‌ ఫర్‌ ఐనోస్పిరిక్‌ స్టడీస్‌ను ఐఐఎస్టీ రూపకల్పన చేసింది. దీని ద్వారా ఐనోస్పియర్‌పై పరిశోధనలు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com