మసూద్ అజర్‌ విషయంలో అమెరికా కఠిన వైఖరి

- April 04, 2019 , by Maagulf
మసూద్ అజర్‌ విషయంలో అమెరికా కఠిన వైఖరి

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి తీరతామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. మసూద్‌పై నిషేధం విధించే విషయంలో మిత్రదేశాలు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్యలదేశాలతో కలసి అందుబాటులో ఉన్న అన్ని వనరులు ఉపయోగించుకుంటామని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే బ్రిటన్, ఫ్రాన్స్ సహకారంతో సరికొత్త తీర్మానం రూపొందించి మండలి సభ్య దేశాలకు పంపించామని అమెరికా తెలిపింది. ఈ తీర్మానంతో ఐక్య రాజ్యసమితిని తక్కువ చేస్తున్నామనే వాదన సరికాదంది.

 

పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించ డానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు రంగంలోకి దిగాయి. మూడు దేశాలు కలిసి ఐక్య రాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టాయి. మండలిలోని 15 సభ్య దేశాలు 14 దేశాలు ఆ తీర్మానాన్ని ఆమోదించగా చైనా మాత్రమే హోల్డ్‌లో పెట్టింది. ఐతే తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారో రెండు వారాల్లో వివరించాలని చైనాను అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌ డిమాండ్ చేశాయి. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, ఇటీవల భద్రతామండలిలో మరో తీర్మానం ప్రవేశపెట్టింది. మసూద్‌పై ఆంక్షలు విధించి, అతని ప్రయాణాలు నిషేధించాలని, ఆస్తులను స్తంభింపజేయాలని ఆ తీర్మానంలో కోరింది.

ఐసిస్‌, అల్‌ఖైదాతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపణ. కొత్త తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం అవసరం లేదు. భద్రతామండలిలోని 9 సభ్యదేశాలు ఆమోదం తెలిపితే సరిపోతుంది. ఇది చైనాకు మంట పుట్టించింది. బలవంతంగా తీర్మానం ఆమోదింపచేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా మండిపడింది. అమెరికా చర్యతో మసూద్‌ సమస్య పరిష్కారం క్లిష్టమవుతుందని విమర్శించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com