పాక్ కు వత్తాసు పలికిన అమెరికా మేగజైన్..మండిపడ్డ భారత్

- April 07, 2019 , by Maagulf
పాక్ కు వత్తాసు పలికిన అమెరికా మేగజైన్..మండిపడ్డ భారత్

ఎఫ్-16 విమానాన్ని భారత్ కూల్చివేయలేదన్న అంశంపై అమెరికాకు చెందిన ఒక మేగజైన్ పేర్కొన్న అంశంపై భారత్ తాజాగా చేస్తున్న వాదనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఎఫ్-016 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని భారత్ చేస్తున్న వితండ వాదన అర్ధరహితమని ఆయన విమర్శించారు. ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసిన విషయం వాస్తవమంటూ ఒకపక్క భారత్ వాదిస్తుండగా, అలాంటిదేమీ లేదని, తమ ఎఫ్-16 విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఈ విషయంలో తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పాక్ తిప్పికొడుతోంది. భారత్-పాక్ ఈ విషయంలో చేస్తున్న పరస్పర వాదనల్లో వాస్తవాలు ఇవి అంటూ వాషింగ్టన్‌కు చెందిన ఒక మేగజైన్ గురువారం సమగ్ర వివరాలను ప్రకటించింది. భారత్ వాదిస్తున్నట్టు ఫిబ్రవరి 27న భారత్ జరిపిన లక్షిత దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోలేదని, ఆ విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్ ఆహ్వానం మేరకు తనిఖీలు నిర్వహించామని, ఆ దేశ విమానాలేవీ గల్లంతు కాలేదని, అన్నింటినీ లెక్కించామని అమెరికా రక్షణ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ధృవీకరించినట్టు ఆ ఫారిన్ పాలసీ మేగజైన్ పేర్కొంది. ఈ పత్రిక రాసిన కథనంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఫిబ్రవరి 27న తాము జరిగిన లక్షిత దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం గల్లంతు అయిన విషయం వాస్తవమంటూ తమ వాదనకు పూర్తిగా కట్టుబడి ఉంటామంటూ భారత్ మరోసారి స్పష్టం చేసింది.

అమెరికా ఫారిన్ పాలసీ రాసిన వ్యాసంపై స్పందించిన పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తనదైన రీతిలో ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. భారత్‌లోని అధికార భారతీయ జనతా పార్టీ వాదనపై మండిపడ్డారు. 'వాస్తవమన్నది ఎప్పుడూ విశ్వవ్యాపితమవుతుంది. భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు వాదిస్తోంది. అలాంటిదేమీ లేదని, పాక్‌కు చెందిన ఎఫ్-16 విమానం గల్లంతు కాలేదని అమెరికా రక్షణ శాఖ అధికారులు చేసిన ప్రకటన గురించి ఫారిన్ పాలసీ మేగజైన్ పేర్కొనడమే మా వాదనకు బలమైన నిదర్శనం' అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాశ్మీర్‌లోని భారత మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న పాకిస్తాన్‌కు చెందిన అమ్రామ్ మిసైల్‌తో దాడికి దిగిన సందర్భంగా దానిని తాము కూల్చివేశామంటూ తగిన ఆధారాలు ఉన్నాయంటూ భారత్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానంతో తమ భూభాగంపై దాడికి యత్నించడం వల్లే తాము దానిని కూల్చివేశామని భారత్ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com