ఈసీ క్లీన్ చిట్..1,381 కేజీల బంగారం టీటీడీదే

- April 28, 2019 , by Maagulf
ఈసీ క్లీన్ చిట్..1,381 కేజీల బంగారం టీటీడీదే

తిరుమల తిరుపతి దేవస్థానంలో దుమారం రేపిన బంగారం విషయంలో ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. స్వామి వారి బంగారం విషయంలో తమకేమి అనుమానాలు లేవంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు టీటీడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. 400 కోట్ల విలువైన 1,381 కేజీల బంగారాన్ని ఈ నెల 20 సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఎన్నికల సంఘం అధికారులు క్లారిటీ ఇచ్చారు.

చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో టీటీడీకి చెందిన బంగారం, ప్లాటినం, వజ్రాలతో వెండి ఉన్నాయి. అయితే..వాటిని టీటీడీకి అప్పగించేందుకు తిరుమల తరలించాలని నిర్ణయించారు. రెండో దశ పోలింగ్ కు ఒక్క రోజు ముందుగానే మూడు వాహనాల్లో 1,381 కేజీల బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ఐటీకి అప్పగించారు. దీంతో టీటీడీలో దుమారం చెలరేగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా అంత బంగారాన్ని ఎందుకు పంపాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఏదో జరుగుతోందని విమర్శలు వినిపించాయి. ఇది స్వామి వారి సొత్తు అంటూ అటు టీటీడీ, పీఎన్బీ వివరణ ఇచ్చిన దుమారం చల్లారలేదు.

బంగారం తరలింపు వ్యవహారంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఏకంగా విచారణకు అదేశించారు. సింఘాల్ టార్గెట్ గానే ఈ ఎంక్వైరీ జరిగినట్లు విమర్శలు కూడా వచ్చాయి. ఈ సమయంలో ఈసీ క్లీన్ చిట్ టీటీడీకి, అటు పీఎన్బీకి ఊరట కలిగించే అంశమే. బంగారం తరలింపులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, టీటీడీ అన్ని జాగ్రత్తలు పాటించింది అని ఈసీ స్పష్టం చేసింది. తిరుపతికి బంగారం తరలించే విషయాన్ని ముందే తమిళనాడు ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా సమాచారం అందించారు బ్యాంకు అధికారులు. మూడు వాహనాల్లో నలుగురు సాయుధ బలగాల రక్షణలో గోల్డ్ తరలిస్తున్నామని..వాహనాలు, డ్రైవర్లు, తమ సిబ్బంది పేర్లు, గన్ మెన్ ల వివరాలతో సమగ్రంగా లేఖ రాసింది.

ఏప్రిల్ 17న అన్ని డాక్యుమెంట్లతో బంగారం తరలిస్తుండగా స్థానిక పోలీసులు సీజ్ చేశారు. డాక్యుమెంట్లు అన్ని క్లియర్ గానే ఉన్నా.. అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో తిరిగి అప్పగించటంలో జాప్యం జరిగినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత వెంటనే బంగారాన్ని అప్పగించామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com