తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా..

- May 02, 2019 , by Maagulf
తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా..

తెలుగు రాష్ట్రాలపై అంతర్జాతీయ ఆన్‌లైన్‌ హ్యాకర్లు రెచ్చిపోయారు. TS, AP విద్యుత్‌ పంపిణీ సంస్థలైన డిస్కంల వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు. ర్యాన్‌సమ్‌వేర్‌ వైరస్‌ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను దొంగిలించి.. పూర్తిగా డిలీట్‌ చేశారు. హ్యాక్ చేసిన డేటాను వెనక్కి ఇచ్చేందుకు 35 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వాలని హ్యాకర్లు మెయిల్‌ పంపించినట్లు అధికారులు తెలిపారు. అయితే, 4 డిస్కంలకు సంబంధించిన సర్వర్లకు బ్యాకప్‌ ఉండడంతో డేటా భద్రత సమస్య తప్పింది.

ఈ డిస్కంల ద్వారానే 2 రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. ఈ సంస్థల వెబ్‌సైట్లను తిరుపతి కేంద్రంగా టీసీఎస్‌ నిర్వహిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచే డిస్కంల వెబ్‌సైట్ల సర్వర్లను తిరుపతి నుంచి నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని మెయిల్స్‌ను తెరవగానే వీటి సర్వర్లలో వైరస్‌ చొరబడి వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసింది. సర్వర్ల నుంచి మొత్తం డేటాను డిలీట్‌ చేయడంతోపాటు వాటిని తెరుచుకోకుండా చేశారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురికావడంతో 2 రోజులుగా ఆన్‌లైన్, పేటీఎం ద్వారా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు స్తంభించిపోడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.

తమ సంస్థ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్లు TSSPDCL సీఎండీ రఘుమారెడ్డి ధ్రువీకరించారు. TCS సంస్థ ఐటీ నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. డిస్కంలు హ్యాకింగ్‌కు గురికావడంతో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా…కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 65 కింద హ్యాకర్లపై కేసు నమోదు చేశామని సీసీఎస్‌ అదనపు డీసీపీ తెలిపారు.

ఏపీ, తెలంగాణలోని 4 డిస్కంలతో పాటు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ సైతం హ్యాకింగ్‌కు గురైనట్టు తెలుస్తుంది. దీనితో పాటు ఆంధ్రాబ్యాంక్‌ వెబ్‌సైట్‌ను సైతం టార్గెట్‌ చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకు ఆంధ్రాబ్యాంక్, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com