చైనాకు చుక్కెదురు.. పాక్‌కు షాక్‌

- August 18, 2019 , by Maagulf
చైనాకు చుక్కెదురు.. పాక్‌కు షాక్‌

అంతర్జాతీయంగా భారత్‌కు మరో విజయం. పాకిస్థాన్‌కు దౌత్యపరంగా మరో దెబ్బ. ఆర్టికల్‌ 370 కింద కశ్మీరుకు ఉన్న హోదా రద్దు, రాష్ట్ర విభజన తరువాత ఆ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు పాక్‌ చేసిన యత్నం ఫలించలేదు. మిత్రదేశం చైనా సహకారంతో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి దృష్టికి కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ తీసుకెళ్లగలిగింది. అధికారిక సమావేశాలు జరిగే టేబుల్‌ (హార్స్‌ షూ టేబుల్‌) వద్ద మాత్రం ఈ చర్చలు జరగలేదు. ఇష్టాగోష్ఠిగా రహస్య సంప్రదింపులు మాత్రం సాగాయు. ఈ క్రమంలో మండలి సభ్యదేశాలన్నింటి మద్దతు సాధించడంలో పాక్‌ విఫలమైంది. పాక్‌ బాధను భుజాలకెత్తుకున్న చైనాకూ భంగపాటు ఎదురైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7-30 గంటల నుంచి 9 గంటల దాకా 15 సభ్యదేశాలూ ఈ అంశంపై ఇష్టాగోష్ఠిగా చర్చించాయి. భారత్‌, పాకిస్థాన్‌లు రెండూ ఈ సమావేశంలో నేరుగా పాల్గొనలేదు. పాక్‌కు తగిలిన మరో దెబ్బ ఏంటంటే.. ఈ సంప్రదింపులకు తమనూ అనుమతించాలని, నియమావళిలోని 37వ నిబంధన ప్రకారం.. తమను లోనికి రానివ్వాలని కోరినా ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న దేశం పోలెండ్‌ అందుకు తిరస్కరించింది.

ట్రంప్‌కు ఇమ్రాన్‌ ఫోన్‌!
శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు అగ్రరాజ్యాల్లో అమెరికా ప్రత్యేకంగా ఎలాంటి వైఖరినీ ప్రకటించలేదు. సమావేశం జరగడానికి ఓ రెండుగంటల ముందు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫోన్‌ చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఫ్రాన్స్‌, రష్యా భారత నిర్ణయాన్ని సమర్ధించాయి. ముఖ్యంగా రష్యా భారత్‌కు పూర్తి బాసటగా నిలిచింది. '' కేవలం ఏం జరుగుతున్నదీ తెలుసుకొనేందుకు మాత్రమే ఈ సమావేశం తప్ప కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమన్నది సుస్పష్టం. మా వైఖరి ముందే చెప్పాం. ఆ రెండు దేశాలే దీనిని చర్చించి పరిష్కరించుకోవాలి'' అని రష్యా ప్రతినిధి దిమిత్రీ పోల్యాన్‌స్కీ తేల్చిచెప్పారు. బ్రిటన్‌ కూడా పాక్‌-వ్యతిరేక విధానాన్నే అవలంబించింది. ఇక తాత్కాలిక సభ్య దేశాల మద్దతు సాధించేందుకు పాకిస్థాన్‌ శతధా ప్రయత్నించింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370వ అఽధికరణాన్ని భారత్‌ నీరుగార్చడం వల్ల ప్రాంతీయంగా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని, భారత్‌ను కట్టడి చేయాలని పాక్‌ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్‌ ఖురేషీ తాత్కాలిక సభ్యదేశాల విదేశాంగమంత్రులకు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి మరీ విజ్ఞప్తి చేశారు. శాశ్వత సభ్యదేశాల అధినేతలను సైతం కాంటాక్ట్‌ చేసినా ఆయనకు నిర్దిష్ట హామీ లభించలేదు.

అటు ఐక్యరాజ్యసమితిలో పాక్‌ శాశ్వత రాయబారి మలీలా లోధీ కూడా సభ్యదేశాల దౌత్యవేత్తలతో గత రెండు వారాలుగా తీవ్రస్థాయిలో లాబీయింగ్‌ జరుపుతూనే ఉన్నారు. ఇంతచేసినా ఫలితం శూన్యమని మండలి వర్గాలు వివరించాయి. చైనా ప్రత్యేకంగా లాబీ చేయకపోయినా శాశ్వత సభ్యదేశంగా తనకున్న హోదాను అడ్డుపెట్టుకుని ఈ అంశాన్ని లోపలిదాకా తీసుకుపోగలిగిందే తప్ప ఎవరినీ ఒప్పించలేకపోయింది. కశ్మీర్‌ విభజనతో తనకూ నష్టమని భావించిన డ్రాగన్‌.... పాక్‌ ఒత్తిడికి తలొగ్గి, పాక్‌ లేఖను ముందుకు తీసుకెళ్లి దౌత్యపరంగా తానూ ఇరకాటంలో పడిందని నిపుణులు విశ్లేషించారు. 370వ అధికరణం కల్పించే ప్రత్యేక హోదాను తీసేయడం ఉపఖండ శాంతిని దెబ్బతీస్తుందని మండలికి ఈనెలలో అధ్యక్షత వహిస్తున్న పోలెండ్‌ ప్రతినిధి జోనా రోనెకాకు రాసిన లేఖలో పాక్‌ వాదించింది. ఈ లేఖను మండలి సభ్యదేశాల దృష్టికి చైనా తీసుకెళ్లింది. అయితే కశ్మీర్‌ వ్యవహారం భారత్‌, పాక్‌లు ద్వైపాక్షికంగా తేల్చుకోవాల్సిన అంశమని తాత్కాలిక సభ్యదేశాలు- బెల్జియం, కోట్‌ డివోయిర్‌, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వెటోరియల్‌ గినియా, జర్మనీ, ఇండొనేషియా, కువైట్‌, పెరూ, దక్షిణాఫ్రికా, పోలెండ్‌ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనేక దేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరిగే గదిలోకి వెళ్లేముందే తమ వైఖరిని వెల్లడించినట్లు సమితిలో భారత దౌత్యవర్గాలు వివరించాయి. ఈ వ్యవహారం ద్వైపాక్షికమేనని దక్షిణాఫ్రికా, ఇండొనేషియా, పోలెండ్‌, జర్మనీ ప్రకటించాయి. 1965లో చివరిసారిగా కశ్మీర్‌ అంశంపై భద్రతామండలి సమావేశంలో పూర్తి చర్చ జరిగింది. దాని తరువాత సంప్రదింపుల రీతిలోనైనా చర్చ సాగడం ఇదే ప్రథమం!

మూడు రోజుల్లోనే భేటీ: పాక్‌
కాగా, భద్రతామండలి రహస్య సమావేశాన్ని తమ విజయంగా పాక్‌ చెప్పుకొంటోంది. తాము కోరిన రీతిలో కేవలం 72 గంటల వ్యవధిలో ఈ సమావేశాన్ని మండలి ఏర్పాటు చేసిందని పాక్‌ శాశ్వత ప్రతినిధి మలీలా లోధీ- సమావేశానంతరం మీడియాతో అన్నారు. ''కశ్మీరీలు శ్రీనగర్‌లో, లోయలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారి గొంతు ను ప్రపంచదేశాలకు వినిపించడంలో మేం సఫలమయ్యాం'' అని పేర్కొన్నారు. సమస్య ను ఈ స్థాయికి తీసుకురావడమే అంతర్జాతీయం చేసినట్లు అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు- చైనా కూడా భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏ దేశమూ ప్రత్యేకించి సమర్ధించలేదని పేర్కొంది.

ఆంతరంగికం 
భారత్‌ ''370వ అధికరణంపై మేం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆంతరంగికం. వీటిపై బాహ్యంగా ఎలాంటి విపరిణామాలూ ఉండవు'' అని సమావేశం ముగిశాక భారత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. ''కశ్మీర్లో ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని పాక్‌ చేస్తున్న వాదన వాస్తవ విరుద్ధం. ఒకటొకటిగా అన్ని ఆంక్షలూ ఎత్తేసి పరిస్థితిని సాధారాణ స్థితికి తీసుకువస్తున్నాం. కశ్మీర్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా సకల జాగ్రత్తలూ తీసుకున్నాం'' అని ఆయన వివరించారు. ''చర్చలు ప్రారంభించాలంటే మొదట ఉగ్రవాదాన్ని ఆపండి'' అని పాక్‌కు అక్బరుద్దీన్‌ మరోమారు హితవు పలికారు. ఒక దేశంపై (భారత్‌పై) జిహాద్‌ జరపాలని మరొక దేశాధిపతి (పాక్‌ అధ్యక్షుడు) పిలుపివ్వడం, మా దేశంలో హింసోన్మాదాలకు పాక్‌ నేతలు రెచ్చగొట్టడం తీవ్ర ఆందోళన కలిగించే అంశాలు'' అన్నారు. ఉగ్రవాదుల రక్తపాతాన్ని, కశ్మీరీలపై వారి హింసను ఆపడానికే ఈ చర్యలు (370 రద్దు, విభజన..) తీసుకున్నాం. సుపరిపాలన, జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌ల సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం మా చట్టసభలు ఈ నిర్ణయం తీసుకున్నాయి'' అని అక్బర్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com