హైదరాబాద్:ఆక్వా అక్వేరియా - 2019 ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

- August 31, 2019 , by Maagulf
హైదరాబాద్:ఆక్వా అక్వేరియా - 2019 ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్:ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ రోజు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్ధ (ఎంపిఇడిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే రెండో స్ధానంలో భారత్ ప్రస్తుతం ఉందని, మొదటి స్దానానికి చేరడానికి‌ కృషి జరగాలని ఈ సందర్భంగా అన్నారు.

ఆక్వారంగంలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలో ఆక్వా ఉత్పత్తుల‌లో మొదటి స్దానానికి చేరేందుకు కృషి జరగాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న జల వనరులను కేవలం 40 శాతమే ఆక్వా కల్చర్ కు వినియోగించుకుంటున్నామని చెబుతూ, ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపిఇడిఎ లాంటి సంస్ధలు, ప్రభుత్వ సంస్దలు, పరిశోధనా సంస్దలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్ మెంట్ పద్దతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలని, వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకోవాలని కూడా పేర్కొన్నారు. క్షేత్ర స్ధాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాలలో తగిన వాటా ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు.

దేశంలో ఆహార సమృద్ది ఉన్నప్పటికీ, ప్రోటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులను మించిన సరైన అహారం‌ మరొకటి లేదని అన్నారు. సాంప్రదాయ ఆహార పద్దతులే సరైనవని చెబుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించిన ‘ఫిట్ ఇండియా‘ కార్యక్రమం ఉద్యమంగా మారాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భౌతికంగా ఫిట్ గా ఉన్నపుడే మానసికంగా దృఢంగా ఉంటామని ఆయన‌ పేర్కొన్నారు. ఫిట్ నెస్, యోగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార అలవాట్లను పునః సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ, ప్రోటీన్లతో కూడిన పోషకాహారం పోషకాల లోపాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టడాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. అక్వారంగంలో జరిగే పరిశోధనలు ఆ రంగం రైతులకు ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ఉద్భోదించారు.

తెలంగాణా మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ది పథకం కింద మత్స్యకారులకు 70-90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ‘ప్రధాన మంత్రి సురక్ష యోజన’ కింద మాత్స్యకారులకు లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో 128 కోట్ల సీడ్ పంపిణీ అయిందని, 4 కోట్ల పైగా రొయ్యల సీడ్ ను జలాశయాల్లో వదిలినట్లు, దీనివల్ల రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ది ఊపందుకొందని అన్నారు. ఎంపిఇడిఎ సాంకేతిక సహాకారం రాష్ట్రానికి అందించాలని కోరారు. తొమ్మిది ప్రాంతాలలొ ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకం విజయవంతం కావటంతో ఈ ఏడాది మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో రాష్ట్రం‌ నుంచి ఆక్వా ఎగుమతుల వృద్దికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.

అంతకు ముందు, ఆంద్ర ప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ. సువిశాల సముద్రతీరం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని అన్నారు. 14.5 లక్షల మంది రాష్ట్రంలో ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, అందుకు తగిన రీతిలో ఈ రంగం అభివృద్దికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఆకారణంగా డీజిల్ రాయితీ ని పెంచడం, నాణ్యమైన సీడ్ ను ఇచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అక్వా రైతుల పట్టుదలే రాష్ట్రంలో అభివృద్దికి కారణమని అన్నారు. హ్యాచరీస్ కు సంబంధించి నాణ్యమైన సీడ్ అందించేందుకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఎంపిఇడిఎ సహకరించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నివారణకు పాలిమర్ కిట్స్ పంపిణీ లో ప్రైవేట్ సంస్ధలను కూడా అనుమతించాలని సూచించారు. మెరైన్ రంగంలో మార్పులు చేసి ఆదునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలని ఎంపిఇడిఎ కు సూచించారు.

ఎంపిఇడిఎ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆక్వారంగ అభివృద్దికోసం ప్రభుత్వం, ప్రైవేటురంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు.ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చెసిన పది మంది ఆక్వా రైతులకు ఉప రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.రాజ్య సభ సభ్యులు బండ ప్రకాశ్, చేవెళ్ళ లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com