ముదురుతున్న తెలంగాణ సమ్మె..సమ్మెకు దిగుతున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు

- October 17, 2019 , by Maagulf
ముదురుతున్న తెలంగాణ సమ్మె..సమ్మెకు దిగుతున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు

 

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తలపట్టుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆర్టీసీ కార్మికులతోపాటు ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు సమ్మెబాట పడుతున్నారు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రూపంలో కేసీఆర్ కు పెద్ద తలనొప్పి తగిలింది. సమ్మెను ఎలా విరమింపజేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అటు ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర పరిధి ధాటి జాతీయ స్థాయిలోకి వెళ్లిపోయింది. 

అటు హైకోర్టు సైతం కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించింది. అంతేకాదు ఆర్టీసీకి నూతన ఎండీని నియమించాలని కూడా ఆదేశించింది. మరోవైపు రెండురోజుల్లో ఉద్యోగుల జీతాలు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఒకవైపు సమ్మె సెగ గట్టిగా తగులుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం మెట్టుదిగడం లేదు. అటు హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదు. చర్చలకు పిలవాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం పెడచెవిన పెట్టారు. అంతేకాదు సమ్మెకు రాజకీయ రంగు కూడా పులుముకుంది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. అంతేకాదు ఆర్టీసీకార్మికులకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు సామూహిక దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే.  

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ప్రభుత్వం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి ఆడచెక్కలో పోకచెక్కలా తయారైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెను తట్టుకోవడమే కష్టంగా ఉన్న సమయంలో తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ కూడా సమ్మెబాట పడుతున్నట్లు తెలపడంతో పుండుమీద కారం చల్లినట్లైంది.  ఓలా, ఊబర్ తోపాటు వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు ఈనెల 19 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు అధ్యక్షుడు షేక్ సలాలుద్దీన్ స్పష్టం చేశారు. 

ఓలా, ఊబర్ వంటి క్యాబ్ డ్రైవర్లు సమ్మెబాటపడితే దాదాపు 50వేల క్యాబ్ లో తమ సర్వీసులను నిలిపివేయనున్నాయి. దాంతో రవాణా మరింత కష్టంగా మారనుంది. ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ కి తమ డిమాండ్ల లిస్ట్ ను గతంలో అందించామని అయినప్పటికీ తమ సమస్యలను పరిష్కరించడం లేదని తెలంగాణ స్టేట్ ట్యాక్సీ,డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ షేక్ సలాలుద్దీన్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఊబర్, ఐటీ కంపెనీలకు కూడా డిమాండ్ ల లిస్ట్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కిలోమీటరుకు కనీసం 22 రూపాయల ఛార్జీగా నిర్ణయించాలని అలాగే మెరుగైన జీవన పరిస్థితులు, పని ప్రమాణాలను నిర్ధారించడానికి ఉబెర్, ఓలా క్యాబ్‌లు మరియు ఇతర టాక్సీ అగ్రిగేటర్ సేవలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. డ్రైవర్లందరికీ కనీస వ్యాపార హామీని నిర్ధారించేలా అగ్రిగేటర్ మార్కెట్ ప్రదేశాలకు అనుసంధానించబడిన క్యాబ్‌ల సంఖ్యపై పరిమితి విధించడం వంటి అంశాలను డిమాండ్లలో పొందుపరిచినట్లు యూనియన్ నేతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com