సౌదీ వీసాల చార్జీల పెంపు..ఆరు రెట్లు పెరగడంతో హజ్‌ యాత్రికుల్లో ఆందోళన

- October 24, 2019 , by Maagulf
సౌదీ వీసాల చార్జీల పెంపు..ఆరు రెట్లు పెరగడంతో హజ్‌ యాత్రికుల్లో ఆందోళన

రియాద్‌: సౌదీ అరేబియా వీసాల చార్జీలను ఆరు రెట్లకు పెంచింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ పర్యటన ఇకపై భారంగా మారే ప్రమాదముంది. అంతేగాకుండా, హజ్‌, ఉమ్రా యాత్రలకు వెళ్లే మధ్య తరగతి కుటుంబీకులకు ఈ వీసాల చార్జీల పెంపుదల పెను భారంగా మారనుంది. సింగిల్‌ ఎంట్రీ, మల్టిపుల్‌ ఎంట్రీ, ఆరునెలల వీసాలు, ఏడాది వీసాల ఛార్జీలు భారీగా పెరిగాయి. గతంలో 93 డాలర్లు ( రూ.6,583 ) ఉన్న సౌదీ అరేబియా సింగిల్‌ ఎంట్రీ వీసాల చార్జీలు 533 డాలర్లకు ( రూ.38,731) పెరిగాయి. మల్టిపుల్‌ ఎంట్రీ, ఆరు నెలల వీసా చార్జీలు పొందాలంటే 800 డాలర్లు ( రూ.56,640 ), ఏడాది వీసాలు పొందాలంటే 1,333 డాలర్లు ( రూ.94,377) చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో వీసా చార్జీలను పెంచడానికి పెద్దగా కారణాలేమీ లేవు అయితే, వీసాల చార్జీల మొత్తాన్ని సమీక్షిస్తామని కొద్దిరోజుల కిందటే చేసిన ప్రకటనకు అనుగుణంగా వీటి రేట్లను పెంచారు. ఒక్క హజ్‌ యాత్రకు వెళ్లే భక్తుల కోసమే కాకుండా సౌదీ అరేబియాకు వెళ్లే ప్రతీ విదేశీయుడికి వీసాలను మంజూరు చేయడానికి ఆయా మొత్తాన్ని వసూలు చేస్తుంది ప్రభుత్వం. హజ్‌ యాత్రకు మినహాయింపేమీ ఇవ్వలేదు. తొలిసారి హజ్‌ యాత్రకు వెళ్లే వారికి మాత్రమే ఈ పెంపుదల వర్తించదని సౌదీ అరేబియా ప్రభుత్వం వెల్లడించింది.

సౌదీ అరేబియా ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సిఫారసుల మేరకే తాము వీసా చార్జీలను పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ పెంపుదలను పలు ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింల జనాభా అధికంగా ఉండే మొరాకో...హజ్‌ యాత్రను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. భారీగా పెంచిన వీసాల ఛార్జీలను తగ్గించేంత వరకూ తాము హజ్‌ యాత్రను బహిష్కరిస్తామని వెల్లడించింది. టర్కీ, ఈజిప్టు, నైజీరియా వంటి దేశాలు సైతం అదే బాటలో నడుస్తున్నాయి. పెంచిన వీసాల చార్జీల తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com