పంజాబ్ లో ఉగ్రవాదులు కలకలం!
- January 12, 2016
పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లా లో ఇద్దరు వ్యక్తుల సంచారం మంగళవారం కలకలం సృష్టించింది. పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ బేసిన్ లో ఇటీవలే పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ విషయం అందరికీ విదితమే. మళ్లీ కొన్ని రోజుల్లోనే ఆర్మీ దుస్తువుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్ దాస్ పుర్ లోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిరోజ్ పుర్ పాకిస్థాన్ కు సరిహద్దుగా ఉన్న జిల్లా. గుర్ దాస్ పుర్ నుంచి ఫిరోజ్ పుర్ కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఉగ్రవాద చర్యలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.వెంటనే అక్కడికి చేరుకుని అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని చుట్టుముట్టారు. ఫిరోజ్ పుర్ లో హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బలగాలను, అదనపు పోలీసు సిబ్బందిని అక్కడికి తరలించినట్లు సమాచారం. ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం ఆ భవనం సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరోజ్ పుర్ తో పాటు గుర్ దాస్ పుర్ జిల్లాలోనూ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. చెరకు పంట పొలాల్లో, సమీప గ్రామాల్లో పోలీసులు, ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుర్ దాస్ పుర్ స్థానికుడు ఇద్దరు ఆర్మీ దుస్తువులు ధరించిన ఇద్దరిని చూసినట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్మీ దుస్తువుల్లో వచ్చి పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందడంతో పాటు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







