నారావారిపల్లెలో పశువుల పందాలు...

- January 17, 2016 , by Maagulf
నారావారిపల్లెలో పశువుల పందాలు...

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల జల్లికట్టు (పశువుల పందాలు) నిర్వహించారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, భీమవరం, బి.కొంగరవారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు.సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామదేవతల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరిగాయి. కోడెగిత్తల కొమ్ములకు కానుకలు కట్టి డప్పు వాయిద్యాలతో ఉరకలెత్తించారు.వీధి చివర్లో వేచి ఉన్న యువత కోడెగిత్తలను ఒడిసి పట్టుకుని వాటి కొమ్ములకున్న కానుకలను చేజిక్కించుకున్నారు.కొన్ని కోడె గిత్తల పౌరుషం ముందు యువత చేతులెత్తేశారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి జిల్లా నలుదిక్కుల నుంచి జనాలు వేలాదిగా తరలిరావడంతో రంగంపేట కిక్కిరిసి పోయింది.ఐరాల మండలం ఇరువారం పల్లె పంచాయతీ కలికిరిపల్లెలోనూ జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును సుప్రీం కోర్టు బ్యాన్ చేసినప్పటికీ... కొనసాగడం గమనార్హం.కాగా, ఏపీలో పశువుల పండుగ జరుపుకున్నారని, పశువుల పండుగ అంటే జల్లికట్టు కాదని, పశువులను అందంగా ముస్తాబు చేశారని కొందరు చెబుతున్నారు. అయితే, జల్లికట్టు సందర్భంగా పశువుల పందాలు నిర్వహించడం కనిపించింది.రామచంద్రాపురం మండలంలోని బొప్పరాజుపల్లి, నూతుగుంటపల్లి, అనుప్పల్లి, వేపకుప్పం గ్రామాల యువతతోపాటు, గ్రామస్థులు పశువుల కొమ్ములకు కట్టిన ప్రోత్సాహక బహుమతులను కైవసం చేసుకున్నారు. పందేల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.యర్రావారిపాళెం మండలంలో శనివారం పశువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. సాయంత్రం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వచ్చారని తెలిసి ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. సంక్రాంతి పండుగను చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు నారావారిపల్లెలో జరుపుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com