విమానంలోనే కన్నుమూసిన ఏ.పి వ్యక్తి

- January 31, 2020 , by Maagulf
విమానంలోనే కన్నుమూసిన ఏ.పి వ్యక్తి

తిరుపతి:కువైట్‌ నుంచి బయలుదేరిన శ్రీనివాసులు బాలాజీ (45) విమానంలోనే గుండెపోటుతో అసువులు బాశారు. దీంతో దామినేడులో విషాదం నెలకొంది. తిరుపతి దామినేడుకు చెందిన బాలాజీ డ్రైవర్‌ పనిచేస్తూ ఉపాధి కోసం పదేళ్ల కిందట కువైట్‌ వెళ్లారు. ఈయన భార్య జయలక్ష్మి కూడా నాలుగేళ్ల క్రితం భర్త వద్దకే వెళ్లారు. తమ ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రుల వద్దే బాలాజీ ఉంచారు. తన బిడ్డలను చూడాలని బుధవారం సాయంత్రం ఆయన కువైట్‌ నుంచి విమానంలో చెన్నైకి బయలుదేరారు. విమానంలో ఉన్న సమయంలోనే బాలాజీకి గుండెపోటు వచ్చింది. దీంతో ఎయిర్‌హోస్టెస్‌లు ప్రథమ చికిత్స అందించారు. ఆయనకు గుండెపోటు రావడంతో సాధారణంగా గురువారం వేకువజామున 1.30 గంటలకు చెన్నై చేరుకోవాల్సిన విమానం.. ముందుగానే ల్యాండ్‌ అయ్యేలా ఉత్తర్వులు జారీచేయడంతో 12.50 గంటలకే వచ్చింది.

వెంటనే వైద్య బృందం బాలాజీని పరీక్షించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి, దామినేడులోని మృతుడి తల్లిదండ్రులకు విమానాశ్రయ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, బాలాజీని రిసీవ్‌ చేసుకోవడానికి వెళ్లిన సమీప బంధువులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌.. చివరికి మృతదేహాన్ని తీసుకుని గురువారం సాయంత్రం ఇంటికి వచ్చారు. మృతుడి భార్య జయలక్ష్మి కూడా కువైట్‌ నుంచి బయలుదేరారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటాడన్న తమ కుమారుడు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. తమ తండ్రి నిర్జీవంగా రావడంతో కుమార్తెలు భోరున విలపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com