తెలంగాణ:నేడు మంత్రివర్గ సమావేశం
- February 16, 2020
తెలంగాణ మంత్రి వర్గం ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెవెన్యూ చట్టం మంత్రివర్గం ఆమోదం పొందితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
నిధుల విడుదల విషయలో కేంద్రం తీరుపైనా.. కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణకు ఎక్కువ నిధులు ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పటాన్ని.. TRS నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందుకే అన్ని శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధుల శాతం ఏ విధంగా ఉందో నివేదికలు సిద్ధం చేసి అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి ప్రతియేటా కేంద్రానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వెళ్తుందో… అదే క్రమంలో గత ఐదేళ్లుగా కేంద్రం నుంచి వచ్చే వాటాలు ఎంత శాతం కోత పెడుతున్నారో ప్రజలకు వివరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
కేబినెట్ మీటింగ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనున్నారు. దాదాపు 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించిన బడ్జెట్ నివేదికలను ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు చీఫ్ సెక్రటరీకి అందజేశారు. బడ్జెట్ నివేదికలపై పూర్తిస్థాయిలో చర్చించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది. గత ఏడాది ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా అనేక అంశాలపై ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటన సందర్భంగా.. సీఎం ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా.. మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడేవారి కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకునిరావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై కూడా.. కేబినెట్ మీటింగ్లో చర్చ జరగనుంది. సీఏఏ, ఎన్ఆర్సీపై అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







