ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య

- March 08, 2020 , by Maagulf
ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తిరునగరు మారుతీరావు మృతి చెందారు. తన కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను 2019 సెప్టెంబర్‌లో మారుతీరావు హత్య చేయించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి, ఆరు నెలల కిందట బెయిల్‌పై విడుదలైన మారుతీరావు.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఖైరతాబాద్ పోలీసులు తెలిపారు.

అయితే, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చి గది అద్దెకు తీసుకున్నారని పోలీసులు చెప్పారు.

ఆదివారం ఉదయం మారుతీ రావు భార్య ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. సెల్‌ఫోన్‌కు ఫోన్ చేస్తే స్పందించకపోవటంతో ఆర్యవైశ్య భవన్ రిసెప్షన్‌కు ఫోన్ చేసింది. అలాగే, అనుమానంతో పోలీసులకు కూడా ఆమే ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భవన్ సిబ్బంది మారుతీరావు బస చేసిన గదికి వెళ్లినా ఆయన స్పందించలేదు. ఈలోపు భవన్ వద్దకు చేరుకున్న పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా ఆయన మంచంపై విగతజీవిగా కనిపించారు. మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com