సినీ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్

- March 20, 2020 , by Maagulf
సినీ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్

సినీ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గత ఆదివారం బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సందర్భంగా ఆమె లక్నోలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పార్టీ ఇచ్చారు. దీనికి ప్రముఖ రాజకీయ నేతలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. ఇప్పుడు తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని స్వయంగా ఆమే ప్రకటించారు.

''గత నాలుగు రోజుల నుంచి నాలో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా. అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు నేను, నా కుటుంబ సభ్యులం క్వారంటైన్‌లో ఉన్నాం. నేనెవరిని కలిశానో ఆ వివరాలను కూడా అందిస్తా. విదేశాల నుంచి తిరిగి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో చేయాల్సిన పరీక్షలన్నీ చేశారు. కానీ నాలుగు రోజుల క్రితమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి.'' అని ప్రకటించారు. ఇక, సింగర్ కనికా కపూర్ ఇచ్చిన విందుకు దాదాపు నాలుగు వందల మంది హాజరైనట్లు సమాచారం.

మరోవైపు ఈ పార్టీకి హాజరైన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి హాజరైన తర్వాత దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ఇద్దరు ఎంపీలతో చర్చించడమే కాకుండా దాదపు రెండున్నర గంటల పాటు పార్లమెంటు సెంట్రల్‌ హాలులో కలియ తిరిగారు కూడా.

ఎప్పుడైతే సింగర్ కనికా కపూర్‌కు పాజిటివ్ అని తేలడంతో వెంటనే వసుంధర రాజే సింధియా, ఆమె కుమారుడు దుష్యంత్ స్వయంగా క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయినట్లు ప్రకటించారు. ఇక, యూపీ ఆరోగ్య శాఖా మంత్రి జయప్రతాప్ సింగ్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. సింగర్‌కు పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com