పాక్‌, చైనాలకు భారత్ ఒకేసారి షాక్‌..!

- July 03, 2020 , by Maagulf
పాక్‌, చైనాలకు భారత్ ఒకేసారి షాక్‌..!

చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా భారత్ ఇప్పటికే ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలను కట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చైనాకు చెందిన కంపెనీలు భారత ప్రాజెక్టుల్లో పనిచేయకుండా కేంద్రం నిషేధం విధించింది. తరువాత చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత్ నిషేధించింది. ఇక తాజాగా పాక్‌, చైనాలకు ఒకేసారి భారత్ షాక్ ఇచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా  భారత్ ఆ ఇరు దేశాల నుంచి ఇకపై విద్యుత్ పరికరాలను కొనుగోలు చేసేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ శుక్రవారం వివరాలను వెల్లడించారు.

ఆర్‌కే సింగ్ ఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇకపై చైనా, పాకిస్థాన్ దేశాల నుంచి ఎలాంటి విద్యుత్ పరికరాలను కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. తమ అనుమతి లేకుండా ఆ రెండు దేశాల నుంచి రాష్ట్రాలు విద్యుత్ పరికరాలను కొనుగోలు చేయరాదని అన్నారు. కాగా పాక్‌, చైనాల నుంచి భారత్ ఏటా రూ.71వేల కోట్ల విలువైన విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంటుంది. అందులో చైనా వాటా రూ.21వేల కోట్లు ఉండగా, మిగిలింది పాకిస్థాన్ వాటా. ఈ క్రమంలో చైనాతోపాటు పాక్‌కు ఆ మేర భారీగా నష్టం వాటిల్లనుంది.

చైనా సంగతి పక్కన పెడితే పాక్‌కు ఇది తీరని నష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఆ దేశం ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తమకు సహాయం చేసే దేశాల కోసం ఎదురు చూస్తోంది. అయినప్పటికీ చైనా పాక్‌కు తూతూమంత్రంగానే సహాయం చేస్తోంది. అయితే ఈ రెండు దేశాలు కలిసి భారత్‌పై కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ రెండింటికీ షాక్ ఇచ్చేలా భారత్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com