ఆర్ధిక లోటు పూడ్చుకునేందుకు కొత్త ట్యాక్స్ విధానం అమలు చేయనున్న ఒమన్

- November 03, 2020 , by Maagulf
ఆర్ధిక లోటు పూడ్చుకునేందుకు కొత్త ట్యాక్స్ విధానం అమలు చేయనున్న ఒమన్

మస్కట్:చమురు ధరల్లో క్షీణత, కరోనా సంక్షోభంతో ఏర్పడిన ఆర్ధిక లోటును పూడ్చుకునేందుకు ఒమన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఒమన్ చరిత్రలోనే తొలిసారిగా వ్యక్తిగత ఆదాయంపై పన్నులు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలోని అధిక సంపన్నులను ఇన్ కం ట్యాక్స్ పరిధిలోకి తీసురాబోతోంది. 2022 నుంచి ఈ కొత్త ఆర్ధిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా 2020-24 మధ్యంతర ఆర్ధిక ప్రణాళికలో ఒమన్ ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిజానికి ఆర్ధిక లోటు నుంచి బయటపడేందుకు గత నెలలోనే మధ్యంతర ఆర్ధిక ప్రణాళికను రూపొందించినా..అప్పట్లో వ్యక్తిగత సంసాదనపై పన్నుల విషయంపై ప్రణాళికలో స్పష్టత ఇవ్వలేదు. అయితే..జీసీసీ దేశాల్లో వ్యాట్ మినహా ఇప్పటివరకు వ్యక్తిగత ఆదాయంపై పన్ను విధానం అమలులో లేదు. ఒమన్ ప్రభుత్వం తొలిసారిగా ఇన్ కం ట్యాక్స్ ను అమలు చేస్తుండటంతో మిగిలిన జీసీసీ సభ్య దేశాలు..ఒమన్ ఆర్ధిక విధానాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. 

కరోనా, చమురు ధరల ఒడిదుడుకుల కారణంగా..ఒమన్ లో ఈ ఏడాది ఆర్ధిక లోటు 15.8 శాతంగా ఉన్నట్లు ప్రాథమికంగా లెక్కగట్టారు. అయితే..కొత్తగా చేపట్టిన ఆర్ధిక విధానాల ద్వారా 2024 నాటికి దేశ ఆర్ధిక లోటును స్థూల జాతీయోత్పత్తిలో 1.7 శాతానికి తగ్గించాలని ఒమన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంతేకాదు ఈ ఏడాదిలో ప్రభుత్వ ఆదాయంలో 28 శాతంగా ఉన్న చమురుయేతర ఆదాయాన్ని.... 2024 నాటికి 35 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com