భారత్కు చేరుకున్న మరో 3 రఫేల్ యుద్ధ విమానాలు
- November 05, 2020
న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలో మరో మూడు రఫేల్ యుద్ధవిమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్ నుంచి రెండో విడత రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు చేరుకున్నాయి. మూడు ఫైటర్ జెట్స్ మార్గమధ్యంలో ఎక్కడా ఆగకుండా ప్రయాణించి, గుజరాత్ లోని జామ్ నగర్ లో ల్యాండ్ అయ్యాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. బుధవారం రాత్రి 8.14 గంటల సమయంలో రెండో బ్యాచ్ రాఫెల్ విమానాలు ఇండియాకు చేరాయని ఐఏఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ విమానాలకు అవసరమైన అదనపు ఇంధనాన్ని ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్, మార్గమధ్యంలో గాల్లోనే నింపిందని వాయుసేన ప్రకటించింది. ఫ్రాన్స్ లోని ఇస్ట్రీస్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఇవి 8 గంటలకు పైగా ప్రయాణించాయని, మొత్తం 3,700 నాటికల్ మైళ్ల దూరాన్ని ఇవి ప్రయాణించాయని తెలిపింది.
కాగా, ఈ మూడింటితో కలిపి మొత్తం 8 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు వాయుసేన అమ్ములపొదిలో ఉన్నట్లయింది. మొత్తం రూ. 59 వేల కోట్లతో 36 విమానాలను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు చైనాతో, మరోవైపు పాకిస్థాన్ తో సరిహద్దుల్లో సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఈ విమానాలు మరింత బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, కొత్తగా విమానాలు రావడంపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేనకు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- మక్కాలో మహిళను వేధించిన ప్రవాసి అరెస్టు..!!
- అబుదాబిలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం..అంబులెన్స్లకు గ్రీన్ లైట్లు, ప్రమాదాల అంచనాకు ఏఐ..!!
- మార్చిలో SR150 బిలియన్లు ఖర్చు చేసిన కన్జుమర్లు..!!
- ఒమన్ లో నేటి నుంచి కొత్త ఇంధన కేంద్రాల నియంత్రణ చట్టం..!!
- కువైట్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం..భద్రతకు ప్రాధాన్యత..!!
- ఆస్తమా పై అవగాహనకు ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కార్యాచరణ..!!
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ









