సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

- January 17, 2021 , by Maagulf
సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

న్యూఢిల్లీ: కొవిడ్-19 విజృంభణ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటికే 50దేశాలకు వ్యాప్తి చెందినట్టు ఓ ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు సింగపూర్ చేరుకోగానే తప్పనిసరిగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 25 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కాగా.. ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని ఉండి, నెగెటివ్ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే సింగపూర్ ప్రభుత్వం ఇప్పటి వరకు తమ దేశంలోకి అనుమతిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఈ నిబంధనను విదేశీ పౌరులకు, కొవిడ్ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో పర్యటించినట్టు ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికే పరిమితం చేసింది. అయితే ఈనెల 25 నుంచి అమలులోకి రాబోతున్న ఆదేశాలు మాత్రం విదేశీ పౌరులతోపాటు స్వదేశీయులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com