బహ్రెయిన్: మరో మూడు వారాల పాటు కోవిడ్ ఆంక్షలు పొడిగింపు

- February 20, 2021 , by Maagulf
బహ్రెయిన్: మరో మూడు వారాల పాటు కోవిడ్ ఆంక్షలు పొడిగింపు

మనామా:కరోనా తీవ్రత తగ్గకపోవటంతో కోవిడ్ ఆంక్షలను మరో మూడు వారాల పాటు పొడిగించింది బహ్రెయిన్. కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్...దేశంలో వైరస్ తీవ్రత, వ్యాప్తి వేగంపై సమీక్షించింది. గల్ఫ్ దేశాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటం..బహ్రెయిన్లోనూ వ్యాప్తి తీవ్రత కనిపిస్తుండటంతో ఈ నెల 7 నుంచి అమలులోకి తీసుకొచ్చిన ఆంక్షలను మరో మూడు వారాలు కొనసాగించాలని నిర్ణయించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం మరో 21 రోజులు దేశ పౌరులు, ప్రవాసీయులు తమ సూచనలను తప్పనిసరిగా పాటించాలని టాస్క్ ఫోర్స్ కోరింది. ఎంత కఠినంగా నిబంధనలు పాటిస్తే అంత మేరకు వైరస్ వ్యాప్తిని నియంత్రించొచ్చని వెల్లడించింది. ఈ మూడు వారాల పాటు ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ హాల్స్ తో పాటు రెస్టారెంట్, కేఫ్ లలో డైనింగ్ పై నిషేధం కొనసాగుతుంది. సోషల్ గ్యాదరింగ్స్ పై పరిమిత నిబంధనలు ఉంటాయి. చివరికి ఇళ్లలో కూడా 30 మందికి మించి ఎక్కువ మంది గ్యాదర్ కాకుడదు. ఔట్ డోర్ ఎక్సర్ సైజ్ ప్రాంతాల్లో కూడా 30 మందికి మించి అనుమతి ఉండదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 70 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే...బహ్రెయిన్ ప్రజలను కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తున్న బహ్రెయిన్..రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ కు అత్యవసర అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే అమెరికా-ఫైజర్ బయోన్టెక్, చైనా-సినోఫార్మ్, ఇండియా-కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా స్పుత్నిక్ వ్యాక్సిన్ కు కూడా అనుమతి ఇవ్వటంతో బహ్రెయిన్ లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సంఖ్య నాలుగుకు పెరిగింది. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రవాసీయుడికి వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తామని, వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న వారు http://healthalert.gov.bhద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com