గల్ఫ్ కార్మికుల వేతన పోరాటం...
- February 22, 2021తెలంగాణ:గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) ను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
రెండు నెలల క్రితం ఇదే విషయంపై తాము సమర్పించిన వినతి పత్రం పై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు సమర్పించారు.
గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో నిర్మల్ లో స్వదేశ్ పరికిపండ్ల, కరీంనగర్ లో మైదం శ్రీనివాస్, సిరిసిల్లలో తోట ధర్మేందర్, జనగామ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రిఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం అయిదు నెలల క్రితం సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లు జారీ చేసింది.ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యుఎఇ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 5 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ సర్కులర్ల ప్రకారం అన్ని క్యాటగిరీలను ఒకేగాటన కట్టి కార్మికులకు, వృత్తి నిపుణులకు కనీస వేతనం ఒకే విధంగా నిర్ణయించడం వలన తీవ్ర అన్యాయం జరుగుతున్నదని రవిగౌడ్ అన్నారు. ఈ-మైగ్రేట్ వెబ్ సైటులో అలవెన్సులు గురించి 'నాట్ అవేలబుల్' (సమాచారం అందుబాటులో లేదు) అని పెట్టారు. జీతాలు అమలయ్యే తేదీని 26.06.2015 అని ఐదేళ్ల నాటి పాత డేటు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు, అధ్యయనం చేపట్టకుండా ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో జీతాలు తగ్గించడం భారత్ ను 'చీప్ లేబర్' (తక్కువ జీతానికి పనిచేసే కార్మికులు) అడ్డాగా మార్చడమే. ఇది మానవ హక్కుల, కార్మిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వెట్టిచాకిరి, బానిసత్వానికి దారి తీస్తుందని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చిలో ఛలో ఢిల్లీ...
పార్లమెంటు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుండి ప్రారంభం అవుతున్న సందర్బంగా గల్ఫ్ జెఏసి ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను, కేంద్ర విదేశాంగ మంత్రి డా.ఎస్. జైశంకర్ ను కలిసి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్లను రద్దు చేయాలని కోరుతామని రవిగౌడ్ తెలిపారు. ఈ సర్కులర్ల వలన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయ కార్మికుల ఆదాయంపై ప్రభావం పడుతుందని, సమస్య తీవ్రతను వివరిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..