జగిత్యాల జిల్లాలో పర్యటించిన నెదర్లాండ్స్ (డచ్) విలేఖరి

- March 03, 2021 , by Maagulf
జగిత్యాల జిల్లాలో పర్యటించిన  నెదర్లాండ్స్ (డచ్) విలేఖరి

తెలంగాణ:నెదర్లాండ్స్ (డచ్) కు చెందిన 'డచ్ బ్రాడ్ కాస్ట్ ఫౌండేషన్'- ఎన్ఓఎస్ (టివి, రేడియో, ప్రింట్) అనే వార్తా సంస్థ దక్షిణ ఆసియా ఢిల్లీ విలేఖరి అలెట్టా ఆండ్రే తన కెమెరా పర్సన్ తో పాటు బుధవారం నాడు జగిత్యాల జిల్లాలో పర్యటించారు.ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల గైడ్ గా, అనువాదకులుగా వ్యవహరించారు.ఓవర్సీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్, ఖతార్ ప్రతినిధి తోట ధర్మేందర్ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విదేశీ జర్నలిస్టుకు వివరించారు. 

ఖతార్ లో చనిపోయిన నరుకుల్ల శ్రీను  కుటుంబ సభ్యులను కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లిలో కలిశారు. మృతుడి భార్య అనితను ఇంటర్వూ  చేశారు.కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆదుకోవడానికి సాంఘిక భద్రతా పథకాలు ఏమైనా ఉన్నాయా,ప్రభుత్వం నుండి, కంపెనీ నుండి ఏమయినా ఆర్ధిక సహాయం అందినదా అని అడిగినప్పుడు ఎలాంటి సహాయం అందలేదని ఆమె చెప్పింది. ఇప్పుడు మీ జీవనం ఎలా కొనసాగుతున్నది అనే ప్రశ్నకు ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నానని సమాధానం ఇచ్చింది.వలస వెళ్ళడానికి గల కారణాలు, కుటుంబ ఆర్ధిక  పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.15 సంవత్సరాలు  ఓమాన్ లో పనిచేసి వాపస్ వచ్చి గ్రామంలో స్థిరపడి, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వలసకార్మికుడు అయిలపురం నర్సయ్యను ఇంటర్వూ చేశారు. 

జగిత్యాలలోని హన్సిక మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో గల్ఫ్ ఉద్యోగాల కొరకు ఇంటర్వూలు జరిగే విధానాన్ని, ఉద్యోగార్థులను ఇంటర్వూ చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు చిట్ల రమణ విదేశీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వివరించారు.భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీచేయడం వలన భారతీయ కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నది అనే అంశంపై పరిశీలన చేశారు. జగిత్యాల పట్టణంలోని  మనీ ట్రాన్స్ఫర్ సంస్థలను  పరిశీలించారు.   

అంతకుముందు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చీటీ శ్రీనివాస రావు నేతృత్వంలో జర్నలిస్టుల బృందం విదేశీ జర్నలిస్టు అలెట్టా ఆండ్రే కు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com