కరోనాని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం: సోనియా గాంధీ

- April 17, 2021 , by Maagulf
కరోనాని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం: సోనియా గాంధీ

న్యూఢిల్లీ : ఏడాది సన్నద్ధత ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. కరోనాపై పోరాడడంలో మోడీ సర్కార్‌ కేత్రస్థాయిలో సంసిద్ధంగా లేదని అన్నారు. కరోనా సంబంధిత సాయంలోనూ కేంద్రం రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందని, బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. కాంగ్రెస్‌ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్‌ లేదా ఇతర అభ్యర్థనలు వచ్చినా పట్టించుకోకుండా వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ పరిస్థితులపై చర్చించేందుకు సోనియా అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) శనివారం వర్చువల్‌గా సమావేశమైంది.

కరోనాను కాంగ్రెస్‌ పార్టీ ఒక జాతీయ స్థాయి సవాల్‌గా పరిగణించిందని.. పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిందని ఆమె తెలిపారు.ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన నిర్మాణాత్మక సలహాలను స్వీకరించడానికి బదులు కేంద్రమంత్రులు ఎదురుదాడికి దిగారని అన్నారు.

25 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌..

అలాగే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సోనియా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. 25 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అనుమతించాలని కోరారు. అలాగే దేశంలోని అర్హత గల ప్రతి పౌరుడికి రూ.6 వేల మేర ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని సూచించారు. కరోనాను నిరోధించేందుకు కావాల్సిన వైద్య పరికరాలు, ఔషధాలు సహా ఇతరత్రా సహాయ సామగ్రిపై జిఎస్‌టిని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికీ మెడికల్‌ ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలపై 12 శాతం జిఎస్‌టి కొనసాగడం దురదృష్టకరమన్నారు. సిడబ్ల్యుసి సమావేశంలో రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com