భారత్‌కు చేరుకున్న ఐదో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు..

- April 22, 2021 , by Maagulf
భారత్‌కు చేరుకున్న ఐదో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు..

న్యూ ఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి మరో నాలుగు రాఫెల్‌ యుద్ధ విమానాలు ఈ రోజు భారత్‌కు చేరుకున్నాయి. వీటిని పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు. ఈ మేరకు భారత వైమానిక దళ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ భదౌరియా ఫ్రాన్స్​లోని మెరిగ్​నాక్​ వైమానిక దళ కేంద్రం నుంచి జెండా ఊపి వాటిని ప్రారంభించారు. భదౌరియా ఐదు రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు రాఫెల్‌ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. యుద్ధ విమానాలను సకాలంలో భారత్‌కు పంపించినందుకు ఆయన ఫ్రెంచ్‌ ఏరో స్పేస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

యుద్ధ విమానాలు నేరుగా 8వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశానికి చేరుకున్నాయి. ఈ ప్రయాణంలో.. ఫ్రాన్స్, యూఏఈ వైమానిక దళాలు ఈ విమానానికి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్ అందించినట్లు ఐఎఎఫ్ వెల్లడించింది. ఈ నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్‌ రెండో స్క్వాడ్రన్‌ ఏర్పాటు మరింత వేగవంతం కానుంది. వీటిని పశ్చిమ బెంగాల్‌లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నట్లు వాయుసేన వెల్లడించింది. మొదటి స్క్వాడ్రన్‌ను అంబాలా ఏర్‌బేస్‌లో ఏర్పాటు చేశారు. ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉండనున్నాయి.

సుమారు రూ.58వేల కోట్ల వ్యయంతో 36 రాఫెల్‌ జెట్లను కొనుగోలు చేసుకునేందుకు భారత్‌ 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 14 రాఫెల్ యుద్ధ విమానాలు రాగా.. కొత్తగా వచ్చిన నాలుగు యుద్ధ విమానాలతో ఈ సంఖ్య 18కి చేరింది. ఇంకా 18 యుద్ధ విమానాలు భారత్‌కు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది నాటికి మొత్తం రాఫెల్ జెట్లు భారత్‌కు చేరుకోనున్నాయి. గతేడాది జూలై 29న రాఫెల్‌ మొదటి బ్యాచ్‌ జెట్లు దేశానికి చేరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com