హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్

- May 09, 2021 , by Maagulf
హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్

చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్-5 బీ’ ఎక్కడ పడుతుందో, ఎంత నష్టం కలిగిస్తుందోనని ఇన్నాళ్లూ బిక్కుబిక్కుమంటూ వచ్చింది ప్రపంచం. కానీ ఇప్పుడా భయం లేదు. ఇది తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, ఆదివారం ఉదయం హిందూమహాసముద్రంలో కూలిపోయిందని చైనా ప్రకటించింది. 18 టన్నుల ఈ భారీ రాకెట్ కథ ముగిసింది. ఏప్రిల్ 29 న దీన్ని చైనా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇప్పుడు ఇది హిందూ మహాసముద్రంలో కూలింది గనుక దీని శిథిల భాగాల నుంచి కూడా ముప్పు ఉండదని బీజింగ్ లోని అధికారులు తెలిపారు. మే 9 న తెల్లవారుజామున ఈ రాకెట్ మళ్ళీ భూవాతావరణంలోకి ప్రవేశించింది. మాల్దీవుల సమీపంలో ఈ మహా సముద్రంలో కూలింది. దీని శిథిల భాగాలు రీ-ఎంట్రీ సమయంలోనే నాశనమయ్యాయి అని వారు వివరించారు. అమెరికా మిలిటరీ డేటాను వినియోగించుకునే స్పేస్ ట్రాక్-కూడా దీని రీ-ఎంట్రీని ధృవీకరించింది. లాంగ్ మార్చ్ 5 బీ వ్యవహారం ముగిసింది గనుక ప్రతివారూ రిలాక్స్ గా ఉండవచ్చునని , ‘రాకెట్ ఈజ్ డౌన్’ అని స్పేస్ ట్రాక్ ట్వీట్ చేసింది.

నిజానికి ఈ భారీ రాకెట్ ఎంత ప్రాణ, ఆస్తి నష్టం కలుగజేస్తుందోనని అంతా భయపడ్డారు. దీని స్టాస్టిటికల్ ఛాన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈ భయం మాత్రం తగ్గలేదు. అమెరికన్, యూరోపియన్ అంతరిక్ష పరిశోధకులు ఇది ఎక్కడ పడుతుందోనని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వచ్చారు. దీన్ని పేల్చివేసి కిందకు కూల్చాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ఇది కక్ష్య నుంచి కింద పడకుండా చూడడంలో చైనా నిర్లక్ష్యం వహించిందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. గత ఏడాది లాంగ్ మార్చ్ రాకెట్ కి చెందిన మరో రాకెట్ ఐవోరీ కోస్ట్ లోని కొన్ని గ్రామాలపై పడింది. అప్పుడు ఆస్తి నష్టం జరిగింది గానీ ఎవరూ గాయపడలేదు.. మరణించలేదు కూడా..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com