వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడ్డ షాకింగ్ న్యూస్..

- May 24, 2021 , by Maagulf
వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడ్డ షాకింగ్ న్యూస్..

వాషింగ్ట‌న్‌: క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆరోప‌ణ‌లను నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బ‌య‌ట‌ప‌డింది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రూపం దాల్చ‌డానికి ముందు.. వుహాన్ ప‌రిశోధ‌న‌శాల నుంచి లీకైన‌ట్లు తెలుస్తోంది. వుహాన్‌లో ఉన్న వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌లో ప‌నిచేసే ముగ్గురు ప‌రిశోధ‌కులు 2019 నవంబ‌ర్‌లో హాస్పిట‌ళ్ల చుట్టు తిరిగిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. మ‌హ‌మ్మారిపై చైనా ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ముందే.. వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సిబ్బంది ఆ వైర‌స్‌తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనైట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది. అయితే గ‌తంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ నివేదిక‌ను ఇచ్చిన‌ట్లు కూడా తెలుస్తోంది. ల్యాబ్ లో ప‌నిచేసే సిబ్బంది హాస్పిట‌ళ్ల‌కు వెళ్లిన తీరు, వారికి ఉన్న అనారోగ్యం, క‌రోనా ఉదృతి పెర‌గ‌డానికి ముందు అక్క‌డ జ‌రిగిన ప‌రిణామాలు అనేక అనుమానాలు దారి తీస్తున్న‌ట్లు ఆ ప‌త్రిక పేర్కొన్న‌ది.

వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ వ్యాప్తి జ‌రిగిన‌ట్లు మొద‌ట్లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోప‌ణ‌లు చేశారు. అయితే దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే ఓ సారి ద‌ర్యాప్తు చేప‌ట్టింది. వుహాన్ న‌గ‌రాన్ని విజిట్ చేసిన ఆ బృందం.. క‌రోనా వైర‌స్ స‌హ‌జ‌సిద్దంగానే జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకిన‌ట్లు పేర్కొన్న‌ది. కానీ ఆ నివేదిక‌పై ప‌లు దేశాలు అనుమానాలు వ్య‌క్తం చేశాయి. అయితే క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్ల‌ను గుర్తించేందుకు మ‌ళ్లీ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స‌మావేశ‌మైన నేప‌థ్యంలో వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ త‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ప‌త్రిక క‌థ‌నంపై బైడెన్ ప్ర‌భుత్వం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కానీ కోవిడ్ మ‌హ‌మ్మారి తొలి రోజుల గురించి తీవ్ర స్థాయిలో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు నేష‌న‌ల్ సెక్యూర్టీ కౌన్సిల్ ప్ర‌తినిధి తెలిపారు. వైర‌స్ ఎలా పుట్టింది, ఎక్క‌డ పుట్టింద‌న్న దానిపై డ‌బ్ల్యూహెచ్‌వోతో పాటు స‌భ్య దేశాల‌తో చ‌ర్చించిన‌ట్లు ఆ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఇది రాజ‌కీయ ప్ర‌మేయం లేకుండా జ‌రుగుతంద‌న్నారు. కానీ వైర‌స్ ఆవిర్భావంపై వ‌స్తున్న అన్ని అనుమానాల‌పై అంత‌ర్జాతీయ నిపుణుల‌తో స‌మ‌గ్ర‌మైన విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

గ‌తంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఇచ్చిన నివేదిక‌పై అమెరికా, నార్వే, కెన‌డా, బ్రిట‌న్‌తో పాటు కొన్ని దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. వైర‌స్ పుట్టుక‌పై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని సూచించాయి. ఫిబ్ర‌వ‌రిలో వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌ను విజిట్ చేసిన డ‌బ్ల్యూహెచ్‌వో టీమ్‌.. ల్యాబ్ నుంచి వైర‌స్ లీక్ కాలేద‌న్న రిపోర్ట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వాల్ స్ట్రీట్ క‌థ‌నంపై వాషింగ్ట‌న్‌లో ఉన్న చైనా ఎంబ‌సీ మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com