వీసా దరఖాస్తుల ఫీజులను భారీగా పెంపు ...
- March 08, 2016
బ్రిటిష్ ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ నుంచి అనేక కేటగిరీలకు చెందిన వీసా దరఖాస్తుల ఫీజులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. దీని వలన బ్రిటన్లో నివసించేందుకు, పనిచేసేందుకు గత ఏడాది వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది భారతీయులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. స్వల్పకాలిక పర్యాటక వీసాలు, వృత్తి లేదా విద్యాభ్యాసం కోసం చేసుకునే దరఖాస్తులు సహా వివిధ కేటగిరీల వీసా ఫీజులను 2 శాతం, అలాగే బ్రిటన్ పౌరసత్వాన్ని కల్పించేందుకు, ఆ దేశంలో నివసించేందుకు మంజూరు చేసే వీసా ఫీజులను 25 శాతం పెంచాలని బ్రిటన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదించింది. ఈ వీసా ఫీజుల పెంపు వలన బోర్డర్, ఇమ్మిగ్రేషన్, సిటిజన్షిప్ వ్యవస్థకు దేశంలోని పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన చందా మొత్తాలు తగ్గడంతో పాటు 2019-20 నాటికి ఈ వ్యవస్థ స్వయం సమృద్ధిని సాధించేందుకు వీలవుతుందని బ్రిటన్ హోం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
బ్రిటన్లో అతిపెద్ద వృత్తి నైపుణ్య శ్రామిక వర్గంగా ఏర్పడిన భారతీయులు ఆ దేశంలో నివసించేందుకు, పనిచేసేందుకు అనుమతి కోరుతూ గత ఏడాది అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని ఒఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్కు వలస వచ్చిన శ్రామిక నిపుణులకు 2015లో ఆ దేశం 92,062 వీసాలను మంజూరు చేయగా వాటిలో అత్యధికంగా 57 శాతం (52,360) వీసాలను భారతీయులే కైవసం చేసుకుని అగ్రస్థానంలోనూ, అమెరికన్లు 11 శాతం (10,130) వీసాలను దక్కించుకుని రెండో స్థానంలోనూ నిలిచారని ఓఎన్ఎస్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం వీరిలో చాలా మంది బ్రిటన్ పౌరసత్వాన్ని పొందేందుకు, ఆ దేశంలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సెటిల్మెంట్ అప్లికేషన్ లేదా ఐఎల్ఆర్ (ఇన్డెఫినెట్ లీవ్ టు రీమెయిన్) అప్లికేషన్గా పేర్కొనే ఈ దరఖాస్తు ఫీజును 1,500 పౌండ్ల నుంచి 1,875 పౌండ్లకు పెరగనుండటంతో ఈ దరఖాస్తుదారులంతా అదనంగా మరో 25 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







