సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

- September 11, 2021 , by Maagulf
సింగపూర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సింగపూర్ లో "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంతర్జాలంలో వైభవంగా జరిగాయి. మహా సహస్రావధాని, ప్రఖ్యాత కవిపండితులు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ముఖ్యఅతిథిగా పాల్గొని సుమారు గంటన్నర సేపు తమ ప్రవచనామృతాన్ని అందించారు. ముఖ్యంగా అందరూ పాడుకునే ఆదిశంకర విరచితమైన "ముదాకరాత్తమోదకం" అనే గణేశ పంచరత్న స్తోత్రానికి ప్రత్యేక అర్థ విశ్లేషణ అందిస్తూ వారు ప్రవచించడం అందరికీ ఎంతో జ్ఞానదాయకంగా అనిపించింది.

ఆ స్తోత్ర వివరణ ఆధారంగా మధ్యలో ఎన్నో జీవిత మర్మాలను వివరిస్తూ, నిత్య జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పే నైతిక విధానాలను కూడా చక్కటి చలోక్తులతో వివరించారు. 

"వినాయకచతుర్థి పర్వదిన సందర్భంగా భగవంతుని అనుగ్రహంతో పాటు గురువుగారి ఆశీస్సులను కూడా పొందడం, 'గణేశ పంచరత్న స్తోత్రం' విశిష్టతను భాష్యాన్ని వారి నుంచి తెలుసుకోగలగడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము" అని సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. 

సింగపూర్ లో వివిధ తెలుగు లోగిళ్ళలో కొలువై పూజలందుకున్న వినాయక విగ్రహాలను, అంతర్జాలం ద్వారా అందరూ వీక్షించగలిగే విధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావించారు. దీనివలన అన్ని దేశాల వారు తమ ఇంటి నుంచే సింగపూర్ వినాయక ప్రతిమల దర్శనాన్ని చేసుకోగలిగారు. 

ఈ కార్యక్రమంలో ఇతర నిర్వాహకులు రాధిక మంగిపూడి, భాస్కర్ ఊలపల్లి, చామిరాజు రామాంజనేయులు, సాంకేతిక నిపుణులు గణేశ్న రాధాకృష్ణ, కాత్యాయని, సంస్థ సభ్యులు అనంత్ బొమ్మకంటి, వేణు మల్లవరపు, రాజశేఖర్ తంగిరాల, సుబ్బు పాలకుర్తి, సురేష్ చివుకుల  తదితరులు పాల్గొనగా వందలాది మంది ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాన్ని వీక్షించారు. ముఖ్య స్పాన్సర్లుగా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్, ఈగ జూస్ మొదలైన సంస్థలు సహకారం అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com