ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రక్కసి..

- December 26, 2021 , by Maagulf
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రక్కసి..

ఒకవైపు ఒమిక్రాన్‌..మరోవైపు కరోనా.. వరల్డ్‌ వైడ్‌గా న్యూ వేరియంట్‌ ఒమిక్రాన్‌ కల్లోలం సృష్టిస్తోంది. జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతూ 2 లక్షలకు చేరువవుతున్నాయి కేసులు. ఇప్పటివరకు లక్షా 83వేలకు పైగా కేసులు నమోదవగా..మరో 31 మంది మృతి చెందారు. ఒక్క యూకేలోనే లక్షా 14వేల మందికి పైగా ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. మరో 29 మంది మృతి చెందారు. ఇక డెన్మార్క్‌లో 32వేలు.. కెనడాలో 7,500.. యూఎస్‌లో 6,331 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.యూకేలో 24గంటల్లోనే లక్షకు పైగా కేసులు వెలుగులోకొస్తుండగా..అటు ఫ్రాన్స్​లో లక్షా 4 వేలకు పైగా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫ్రాన్స్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

ఫ్రాన్స్‌లో మరింత దారుణంగా ఉంది. కేవలం ఒక్క రోజే లక్ష కేసులు నమోదయ్యాయి. నిన్న అంటే శనివారం రోజు 104,611 కొత్త కోవిడ్ -19 కేసులు రికార్డ్ అయ్యాయి. గత కొద్ది రోజుల్లో ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 16,162 కోవిడ్ -19 బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 3,282 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారు. ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీని వెల్లడించిన వివరాల ప్రకారం.. అదనంగా 84 కోవిడ్-19 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 122,546కి చేరింది.

ఇటలీలోనూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 54వేలకు పైగా కేసులు వెలుగులోకొచ్చాయి. రష్యాలో 24గంటల్లో 25వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలోనూ కొవిడ్‌ పంజా విసిరింది. 40వేల మందికి పైగా కరోనా సోకింది.

ఇక భారత్‌లోనూ న్యూ వేరియంట్‌ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 459కి చేరాయి ఒమిక్రాన్‌ కేసులు. ముఖ్యంగా మహారాష్ట్ర ఒమిక్రాన్‌కు సెంటర్‌గా మారింది. మహారాష్ట్ర తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌లలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com