కోవిడ్‌ రోగుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స: ఏపీ సిఎం జగన్‌

- January 28, 2022 , by Maagulf
కోవిడ్‌ రోగుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స: ఏపీ సిఎం జగన్‌

అమరావతి: ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇందుకు అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అన్ని జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో నిర్వహించాల్సిందేనన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై వైద్యారోగ్యశాఖ అధికారులతో సిఎం గురువారం సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి శ్రీసిటీలో 220 టన్నుల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ప్లాంటును జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలో 1.09 లక్షల యాక్టివ్‌ కేసులుండగా, 2,709 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఐసియులో 287 మందే ఉన్నారని, వ్యాక్సినేషన్‌ 90 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ, కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మంచి సదుపాయాలు కల్పించాలన్నారు. బీమా సంస్థల రేట్ల కన్నా, ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు మంచి రేట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ అమలుపై క్షేత్రస్థాయిలో కనీసం పది రోజులపాటు పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ముఖ్య కార్యదర్శి, ముద్దాడ రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటి కృష్ణబాబు, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి ఎ బాబు, ఎపిఎంఎస్‌ఐడిసి విసి అండ్‌ ఎమ్‌డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సిఇఒ వినరుచంద్‌, వైద్యారోగ్యశాఖ కమిషనరు కాటంనేని భాస్కర్‌, ప్రత్యేక కార్యదర్శి జిఎస్‌ నవీన్‌కుమార్‌, ఎపివివిపి కమిషనరు వి వినోద్‌కుమార్‌, డ్రగ్స్‌ డైరెక్టరు రవిశంకర్‌, అదనపు డిజిపి రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com