భారత్-ఇజ్రాయిల్‌ మధ్య సంబంధం చరిత్రలో నిలుస్తుంది: ప్రధాని మోదీ

- January 29, 2022 , by Maagulf
భారత్-ఇజ్రాయిల్‌ మధ్య సంబంధం చరిత్రలో నిలుస్తుంది: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: భారత్-ఇజ్రాయిల్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాల చరిత్ర పురాతనమైనదని.. ఇలానే భవిష్యత్తులో కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. శతాబ్దాల నాటి నుంచి భారతదేశం, ఇజ్రాయిల్ ప్రజల మధ్య బలమైన సంబంధం పెనువేసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ – ఇజ్రాయిల్‌ దేశాల మధ్య దౌత్య సంబంధాలను స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రపంచం ముఖ్యమైన మార్పులను చూస్తున్న ప్రస్తుత కాలంలో భారతదేశం-ఇజ్రాయిల్ సంబంధాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని మోదీ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాలలో ఇరువురి మధ్య స్నేహం పరస్పర సహకారంలో కొత్త మైలురాళ్లను సాధిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత్-ఇజ్రాయిల్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు దేశాల అభివృద్ధిలో ఇరు దేశాల మధ్య సహకారం కీలక పాత్ర పోషించిందని ప్రధాని స్పష్టంచేశారు. భారతదేశం మరియు ఇజ్రాయిల్ ప్రజలు ఎల్లప్పుడూ ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నారని.. ఇదే రోజు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధానికి బీజం పడిందని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశం సెప్టెంబర్ 17, 1950న ఇజ్రాయెల్‌ను గుర్తించినప్పటికీ.. దేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు జనవరి 29, 1992న స్థాపించబడ్డాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాయి.

2017లో ఇజ్రాయెల్‌తో 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్‌ను భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించింది. దీంతో దేశంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం అక్రమంగా ట్యాపింగ్‌కు పాల్పడిందని ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ భారత్, ఇజ్రాయిల్ సంబంధాలపై వీడియో సందేశం ద్వారా మాట్లాడడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com