మోదీ కామెంట్స్కు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్
- February 09, 2022
రాజ్యసభలో ఏపీ విభజనపై ప్రధాని మోదీ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అసలు ఏడున్నరేళ్లలో రెండు రాష్ట్రాలకు ఏం చేశారని నేతలు ప్రశ్నిస్తున్నారు. వీటికి కౌంటర్గా బీజేపీ నేతలు రంగంలోకి దిగడంతో హీట్ పీక్స్కు చేరుకుంది. అటు.. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా.. టీఆర్ఎస్ ఆందోళనలకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం నల్లజెండాలతో నిరసన తెలపాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే… రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని ఆరోపించారు. హడావుడిగా చర్చ లేకుండానే విభజన బిల్లు ఆమోదించారని మండిపడ్డారు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేదని.. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మోదీ విమర్శించారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలతో తేనెతుట్టె కదిలినట్లైంది. మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నాంపల్లిలో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం వైపు దూసుకు రావడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. ఇటు పోలీసులు అటు టీ కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరకు వారిని అదుపులోకి తీసుకుని అక్కడ్నుంచి తరలించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణను అవమానించారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణపై మొదట్నుంచి ప్రేమ లేదని ఆరోపించారు.
అసలు తెలంగాణలో ఇంతమంది బలిదానాలకు కాంగ్రెస్, బీజేపీలు కారణం కాదా ? అని ప్రశ్నించారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే అంత మంది చనిపోయేవారా అని నిలదీశారు. ఏడేళ్లయినా విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వాన్ని హరీశ్రావు నిలదీశారు. ప్రధాని వ్యాఖ్యలపై ఇటు టీ కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచీ బీజేపీ వ్యతిరేకం అని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ఆరోపించారు. 2004లో ఏర్పాటు కావాల్సిన తెలంగాణ 2014 వరకు వెళ్లడానికి బీజేపీనే కారణమన్నారు. పార్లమెంట్లో సంపూర్ణ మెజార్టీ లేకున్నా అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ కల సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు భట్టి విక్రమార్క.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







