మందుపాతర పేలుడు కలకలం : చిత్తూరు

- April 07, 2016 , by Maagulf
మందుపాతర పేలుడు కలకలం : చిత్తూరు

 చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో మందుపాతర పేలుడు కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఎదురుగా ఉన్న వాహనాల షెడ్‌లో ఈ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున శబ్దం రావడంతోపాటు, కొంతసేపటి వరకు పొగ కమ్మేసింది. ఈ హఠాత్పారిణామంతో న్యాయవాదులు, కక్షిదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో న్యాయవాది గుమస్తా బాలాజి కుడికాలుకు దెబ్బతగిలింది. వెంటనే ఆయనను చిత్తూరు ఆస్పత్రికి, అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్‌ చంద్రశేఖర్‌.. కోర్టుకు వచ్చి వెళ్లిన కొంతసేపటికే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించడంతో కోర్టులో హడావిడి కాస్త తక్కువగా ఉంది. కోర్టుల వద్ద కక్షిదారులు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న చింటూ, వెంకటాచలపతి, శశిధర్‌ (మేయర్‌ దంపతుల హత్య కేసులోనూ నిందితులు) కేసు వాయిదాకు వచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వారంతా 11.40 గంటలకు బయటకు వెళ్లారు. ఆ తర్వాత 12 గంటలకు పేలుడు సంభవించింది. వాహనాల షెడ్‌లో న్యాయశాఖ ప్రొటోకాల్‌ వాహనం ఫుట్‌పాత్‌ కింద ఉంచిన మందుపాతర పేలినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో షెడ్‌వైపు వెళుతున్న బాలాజి గాయపడ్డారు. జిల్లా జడ్జి ఆనంద్‌, న్యాయమూర్తులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com